జెనీవా: రష్యా దాడితో సతమతం అవుతున్న ఉక్రెయిన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా ఇచ్చింది. పరిశోధనలు చేస్తున్న ల్యాబ్స్లో ఉన్న ప్రమాదకర వ్యాధికారక ప్యాథోజెన్స్ను నాశనం చేయాలని ఉక్రెయిన్ను డబ్ల్యూహెచ్వో కోరింది. ఒకవేళ పరిశోధనశాలలపై దాడులు జరిగితే, దాని వల్ల ఆ హానికరమైన ప్యాథోజెన్స్ పెను విషాదాన్ని మిగిల్చే అవకాశాలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్వో ఆందోళన వ్యక్తం చేసింది.
ఇతర దేశాల తరహాలోనే ఉక్రెయిన్లో పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీలు ఉన్నాయి. అక్కడ ప్రమాదకరమైన వ్యాధుల గురించి అధ్యయనం చేస్తున్నారు. మనుషులు, జంతువులకు సోకే రోగాలపై స్టడీ జరుగుతోంది. కోవిడ్19 గురించి కూడా ఉక్రెయిన్ ల్యాబ్స్లో పరిశోధనలు జరుగుతున్నట్లు డబ్ల్యూహెచ్వో చెప్పింది. కొన్ని ల్యాబ్లకు అమెరికా, ఈయూ, డబ్ల్యూహెచ్వో నుంచి కూడా నిధులు అందుతున్నాయి.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వ్యాధికారక క్రిములపై పరిశోధనలు చేస్తున్న ల్యాబ్స్పై దృష్టి పెట్టాల్సి వస్తోంది. అమెరికా ఆధీనంలో ఉన్న జీవ, రసాయనిక ఆయుధాల కేంద్రాలు ఉక్రెయిన్లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సలహా ఇచ్చింది.