రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. బలగాలను వెనక్కి తీసుకున్నామని రష్యా చెబుతున్నా…. రష్యా బలగాలు ఉక్రెయిన్ సరిహద్దుల్లోనే ఉన్నాయని, యుద్ధం ఖాయమని అమెరికా తెగేసి చెబుతోంది. ఈ నేపథ్యంలో భారత్ వైఖరి ఎలా వుండబోతోంది? అని ప్రపంచ దేశాలు, భారత ప్రజలు ఎదురు చూస్తున్నారు. దీనిపై భారత విదేశాంగ శాఖ ఓ క్లారిటీ ఇచ్చారు. రష్యా- ఉక్రెయిన్ వివాదంలో భారత ప్రభుత్వ వైఖరి తటస్థంగానే వుంటుందని పేర్కొంది. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా భారత్కు అటు అమెరికా, ఇటు రష్యా రెండూ ముఖ్యమే. అందుకే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తటస్థ వైఖరే సరైందని విదేశాంగ శాఖ పేర్కొంటోంది. ఇక యూరోపియన్ దేశాలతో కూడా ఇదే విషయంపై భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే, వైఖరిని స్పష్టం చేస్తోంది. మరో వైపు ఐదు రోజుల పర్యటన నిమిత్తం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ జర్మనీ, ఫ్రాన్స్కు బయలుదేరుతున్నారు. అక్కడ యూరోపియన్ విదేశాంగ మంత్రులతో భేటీ కానున్నారు.
అంతర్జాతీయ వేదికల నుంచి కూడా భారత్ ఇదే విషయాన్ని చెబుతూ వస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ పరిస్థితులు కేవలం చర్చలు, దౌత్యం ద్వారానే సరిచేసుకోవాలని పేర్కొంటోంది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో దౌత్యమే ఏకైక మార్గమని, అన్ని పక్షాలూ సంయమనంతో ఉండాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ఉద్రిక్తతలను పెంచే రీతిలో ఏ దేశమూ ప్రవర్తించొద్దని, దీని ద్వారా ప్రపంచ శాంతికి భంగం వాటిల్లే ఛాన్స్ ఉందని భారత్ అభిప్రాయపడింది. అయితే దీనిని రష్యా స్వాగతించడం విశేషం.