PM Modi | 2002 గుజరాత్ అల్లర్లు, ఆ ఉదంతంలో ప్రధాని నరేంద్రమోదీ పాత్రపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీపై అగ్రరాజ్యం అమెరికా తాజాగా స్పందించింది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ మాట్లాడుతూ.. బీబీసీ రూపొందించిన ఆ డాక్యుమెంటరీ గురించి తనకు తెలియదని అన్నారు. రెండు శక్తివంతమైన ప్రజాస్వామ్యాలుగా అమెరికా, భారత్కు వాటి భాగస్వామ్య విలువల గురించి బాగా తెలుసని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యం శక్తివంతమైందని.. ఈ రెండు దేశాలను కలిపి ఉంచే వాటిపై తమ దృష్టి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ఈ బంధాన్ని బలోపేతం చేసే అంశాలను గురించే తాము ఆలోచిస్తామని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత రాజకీయ, ఆర్థిక సంబంధాలు ఉన్నట్లు చెప్పారు. అమెరికా, భారత్ ప్రజల మధ్య విడదీయరాని బంధం ఉందని నెడ్ ప్రైస్ పేర్కొన్నారు.
2002 గుజరాత్ అల్లర్లు, ఆ ఉదంతంలో ప్రధాని నరేంద్రమోదీ పాత్రపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించింది. అల్లర్లకు మోదీనే బాధ్యుడని బ్రిటన్ ప్రభుత్వ రహస్య విచారణలో తేలిందని అందులో పేర్కొన్నది. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరిట రూపొందించిన రెండు భాగాల్లో మొదటి ఎపిసోడ్ను ఇటీవల యూట్యూబ్ (ఇండియా)లో అప్లోడ్ చేసింది. అయితే, అప్లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే కేంద్ర ఐటీశాఖ ఈ వీడియోను తొలగించింది.
డాక్యుమెంటరీలోని అంశాలను కేంద్రం ఖండించింది. ప్రభుత్వాన్ని అపఖ్యాతి చేయడానికి, ప్రచారంలో భాగంగానే బీబీసీ ఈ డాక్యుమెంటరీ తీసుకొచ్చిందని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ధ్వజమెత్తారు. కాగా, 2002 గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ పాత్ర గురించి వాదనలను పరిశీలించడం ఈ డాక్యుమెంటరీ ఉద్దేశంగా రూపకర్తలు వెల్లడించారు.