గాజా: పాలస్తీనాకు చెందిన తీవ్రవాద గ్రూపు హమాస్ అల్ అక్సా ఫ్లడ్(Operation Al-Aqsa Flood) అనే ఆపరేషన్ చేపట్టింది. దానిలో భాగంగా ఇవాళ సుమారు 5వేల రాకెట్లను ఇజ్రాయిల్పై వదిలింది. ఆకస్మికంగా జరిగిన ఆ దాడి గురించి తెలుసుకుందాం. జెరుసలాంలో ఉన్న అల్ అక్సా మసీదును ఇటీవల అపవిత్రం చేశారు. ఆ మసీదులో ధ్వంస రచన జరిగింది. అయితే ఆ ఘటనకు ప్రతీకారంగా ఇవాళ హమాస్ గ్రూపు అకస్మాత్తుగా రాకెట్లతో విరుచుకుపడింది. హమాస్ మిలిటరీ కమాండర్ మొహమ్మద్ డెయిఫ్ దీనిపై ప్రకటన చేశారు.
వందల సంఖ్యలో పాలస్తీనా ప్రజల్ని ఇజ్రాయిల్ చంపినట్లు డెయిఫ్ ఆరోపణలు చేశారు. ఆ దాడుల్లో అనేక మంది గాయపడినట్లు తెలిపారు. ఖైదీల అప్పగింతకు కూడా ఇజ్రాయిల్ నిరాకరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ చేపట్టినట్లు డెయిఫ్ చెప్పారు. అల్ అక్సా మసీదును స్వాధీనం చేసుకోవడం తమ లక్ష్యమని ఆయన తెలిపారు. జెరుసలంలో ఉన్న అరబ్బులు, ఇజ్రాయిల్లో ఉన్న అరబ్బులు కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలని ఆయన కోరారు.
లెబనాన్, ఇరాక్, సిరియాలో ఉన్న ఇస్లామిక్ తీవ్రవాదులకు కూడా హమాస్ కమాండర్ పిలుపునిచ్చారు. ఆయా దేశాల సైన్యం పాలస్తీనా దిశగా కదిలిరావాలని డెయిఫ్ తెలిపారు. అల్ అక్సా ఆపరేషన్లో జత కలవాలని కోరుతూ అరబ్, ఇస్లామిక్ దేశాల్ని హమాస్ డిప్యూటీ నేత సలేహ్ కూడా కోరారు.
పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులు చేపట్టిన అల్ అక్సా ఆపరేషన్కు ప్రతీకరంగా.. ఇజ్రాయిల్ దళాలు కూడా స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. ఆ ఆపరేషన్కు ఐరన్ స్వార్డ్స్(Operation Iron Swords) అని పేరు పెట్టారు. హమాస్ గ్రూపుపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయిల్.. ఐరన్ స్వార్డ్స్ ఆపరేషన్ ద్వారా రిజర్వ్ దళాలను కూడా తమ సైన్యంలోకి తీసుకోనున్నది. హమాస్ ఆక్మసిక దాడికి ప్రతీకారంగా ఐరన్ స్వార్డ్స్ ఆపరేషన్ చేపట్టినట్లు ఇజ్రాయిల్ రక్షణ దశాలు పేర్కొన్నాయి. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి హమాస్ సుమారు 2200 రాకెట్లను ఫైర్ చేసినట్లు ఐడీఎఫ్ ప్రతినిధి అడ్మిరల్ డానియల్ హగరి తెలిపారు. భూమి, సముద్రం, వాయు మార్గాల్లో హమాస్ ఉగ్రవాదులు తమ దేశంలోకి చొరబడినట్లు ఆయన వెల్లడించారు.