న్యూఢిల్లీ: అణు బాంబు పేలితే ఏం జరుగుతుంది? దాని విస్పోటన శక్తి ఎంత? అణ్వాయుధాలు ఎంత వినాశనాన్ని సృష్టిస్తాయి? పుతిన్ అణు బెదిరింపు చేసిన నేపథ్యంలో న్యూక్లియర్ వెపన్స్తో కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా అణ్వాయుధాలతో భారీ వినాశనాన్ని సృష్టించవచ్చు. అయితే ఆ విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. అణ్వాయుధాం ఎంత సైజ్ ఉంది.. అది భూమిపై ఎంత ఎత్తులో విస్పోటనం చెందింది.. స్థానిక వాతావరణం ఎలా ఉందన్న అంశాలపై ఆ బాంబు ప్రభావాన్ని అంచనా వేయవచ్చు.
న్యూక్లియర్ వెపన్స్ను కిలోటన్నుల్లో పోలుస్తారు. ఒకవేళ వంద కిలోటన్నుల న్యూక్లియర్ బాంబు పేలితే .. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆ బాంబు పేలితే దాదాపు 1.8 కిలోమీటర్ల దూరం వరకు పూర్తిగా నాశనం అవుతుంది. ఇక 3 కిలోమీటర్ల రేంజ్ వరకు నష్టం తీవ్రంగా ఉంటుంది. 5 కిలోమీటర్ల దూరం వరకు భారీ నష్టం ఉంటుంది. బాంబు పడిన ప్రదేశం నుంచి 8 కిలోమీటర్ల రేంజ్ వరకు ఏదో ఒక డ్యామేజ్ జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
బాంబు పడిన ప్రదేశాన్ని అగ్నిగోళంతో పోలుస్తారు. ఆ ప్రదేశంలో ఉన్న బిల్డింగ్లు, వస్తువులు పూర్తినా నాశనం అవుతాయి. ప్రజలు మసైపోతారు. బ్లాస్ వేవ్ ప్రదేశంలో బాంబు తీవ్రత కనిపిస్తుంది. పేలుడు తీవ్రత ప్రదేశంలో మనుషులు చనిపోతారు. కొందరు బ్రతికే ఛాన్సు ఉంటుంది. బిల్డింగ్లు స్వల్పంగా ధ్వంసం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అణుబాంబుల వల్ల రేడియేషన్ వస్తుంది. దీంతో మానవ శరీర కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. రేడియేషన్ సిక్నెస్ వస్తుంది. ఎలక్ట్రోమ్యాగ్నిటిక్ పల్స్ వల్ల.. బాంబు పేలిన ప్రదేశానికి చాలా దూరం వరకు ఎలక్ట్రానిక్స్ వస్తువులన్నీ పాడైపోతాయి. బాంబు పేలిన 15 నిమిషాల తర్వాత నేలపై రాలి పడే బూడిద, మట్టి వల్ల తీవ్రమైన అస్వస్థత కలిగే అవకాశాలు ఉన్నాయి.
చిన్నపాటి వార్హెడ్ వల్ల కూడా భారీ నష్టం జరిగే ప్రమాదం ఉంది. ప్రాణహాని అధికంగానే ఉంటుంది. వాటి పర్యవసానాలు కూడా మెండుగా ఉంటాయి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్లోని హిరోషిమాపై పడిన అణు బాంబు బరువు 15కిలో టన్నులు. ఆ బాంబు వల్ల లక్షా 46 వేల మంది మరణించారు. ప్రస్తుతం రష్యా, నాటో దేశాల వద్ద వెయ్యి కిలోటన్నుల బరువున్న అణు బాంబులు ఉన్నాయి. అణు బాంబు పడిన చోట మనుషులు బ్రతికే వీలులేదు. కళ్లు మూతలుపడే ఫ్లాష్ తర్వాత వచ్చే అగ్నిగోళం, ప్రకంపనలతో బిల్డింగ్లు సంపూర్ణంగా ధ్వంసం అవడం ఖాయం.