WGS – 2025 : వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ (WGS 2025) కు సంబంధించిన 12వ సమావేశం దుబాయ్లో జరిగింది. గ్లోబల్ గవర్నెన్స్కు సంబంధించిన సమస్యలను చర్చించడం కోసం వివిధ దేశాల ప్రభుత్వాలు, వ్యాపార కార్యనిర్వాహకులు, ఆలోచనాపరులను ఒక చోట చేర్చడమే ఈ సమ్మిట్ ఉద్దేశం. యూఏఈ క్యాబినెట్ వ్యవహారాల మంత్రి, ప్రపంచ ప్రభుత్వాల సమ్మిట్ ఛైర్మన్ మహ్మద్ అబ్దుల్లా అల్ గెర్గావి ఈ సమ్మిట్ను నిర్వహించారు.
ఈ సమ్మిట్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, వాతావరణ మార్పు, ప్రపంచ ఆర్థిక సవాళ్లు, విద్య, ప్రపంచ వాణిజ్యంలో అభివృద్ధి చెందుతున్న ధోరణుల గురించి ప్రధానంగా చర్చ జరిగింది. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం, చైనా, అమెరికాల మధ్య పోటీ గురించి ఈ సమ్మిట్లో ప్రధానంగా చర్చించారు. ఈ సమ్మిట్కు 30 మంది దేశాధినేతలు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. అందరూ ఎక్కువగా ఏఐ ప్రభావం పైనే తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఏఐ ఒక అద్భుతమైన టూల్ అని, ప్రపంచ ప్రభుత్వాలు కలిసి పనిచేయడానికి ఏఐ చక్కని అవకాశం కల్పిస్తుందని, గోప్యతా, సైబర్ భద్రతా నియమాలను ఉల్లంఘించకుండానే ఏఐ ప్రపంచ అభివృద్ధికి దోహదపడుతుందని, రాబోయే కొన్ని సంవత్సరాలలో ఏఐలో మార్పులు మంచికే ఉపయోగపడతాయని తాను నమ్ముతున్నానని ఒరాకిల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మైక్ సిసిల్లా అన్నారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో, అంటు వ్యాధి ట్రాకింగ్ కోసం, వ్యక్తిగత ఔషధాల సూచనలో ఏఐ అద్భుతంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.