Pakistan : ఇరాన్ (iran) తో అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ (Tehran) లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం (Pakistan Embassy) సమీపంలో వైమానిక దాడి (Air Strike) జరిగింది. ఈ దాడిపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. దాడికి పాల్పడిన ఇజ్రాయెల్ (Israel) కు గట్టి హెచ్చరికలు చేసింది. తాము ఖతార్ (Qatar) మాదిరి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నది.
టెహ్రాన్లోని పాకిస్థాన్ ఎంబసీకి అత్యంత సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో పాకిస్థాన్ దౌత్య కార్యాలయానికి, అధికారులకు ఎలాంటి హాని జరగలేదు. కానీ సమీపంలోని పలు భవనాలు తీవ్రంగా ధ్వంసమైనట్లు అధికార వర్గాల సమాచారం. అమెరికా- ఇరాన్ల మధ్య సంధి కోసం ఇస్లామాబాద్ ప్రయత్నిస్తున్న సమయంలో ఈ దాడి జరగడం తీవ్ర చర్చనీయాంశం అయింది. దీనిపై పాకిస్థాన్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తంచేసింది.
తాము ఖతార్ మాదిరి కాదనే విషయాన్ని ఇజ్రాయెల్ గుర్తుపెట్టుకోవాలని, ప్రపంచంలో ఎక్కడైనా తమ దౌత్యవేత్తలకు హాని జరిగితే చర్యలు తీవ్రంగా ఉంటాయని పాకిస్థాన్ హెచ్చరించింది. అయితే ఈ దాడులపై ఇజ్రాయెల్గానీ, అమెరికాగానీ ఇంకా స్పందించలేదు. ఇదిలావుంటే పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు కోసం మధ్యవర్తిత్వానికి పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తున్నది. ఇరుపక్షాలు అంగీకరిస్తే అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు ఆతిథ్యం ఇవ్వడానికి ఇస్లామాబాద్ సిద్ధంగానే ఉందని పాకిస్థాన్ అధికారులు తెలిపారు.