టెహ్రాన్: హిజాబ్ ధారణకు వ్యతిరేకంగా ఇరాన్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిరసనలను అణగదొక్కేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. తాజాగా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కార్లలో ప్రయాణించే సమయంలో కూడా హిజాబ్ ధరించాలని ఆ దేశ మహిళలకు ఇరాన్ ప్రభుత్వం అల్టిమేటమ్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నిబంధనను తప్పక పాటించాలని, లేకపోతే చట్టరిత్యా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ దేశ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
దీనికి సంబంధించిన నజర్-1 కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు ఒక సీనియర్ పోలీస్ అధికారి ఫార్స్ వార్తా సంస్థకు తెలిపారు. కార్లలో ప్రయాణించే మహిళలు హిజాబ్ ధరించకపోవడాన్ని గమనించిన వెంటనే సంబంధిత వాహనదారుడికి ఒక హెచ్చరిక సందేశం వెళ్తుందని చెప్పారు. సమాజ నియమ, నిబంధనలను గౌరవించకపోతే చట్టరిత్యా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న హెచ్చరిక జారీ అవుతుందన్నారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, బహిరంగంగా హిజాబ్ ధరించనందుకు 16 ఏళ్ల ముస్లిం యువతి మహ్సా అమినిని ఆ దేశ నైతిక పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్ర హింసలకు గురిచేయడంతో కోమాలోకి వెళ్లిన ఆ యువతి గత ఏడాది సెప్టెంబర్ 16న మరణించింది. ఈ సంఘటనను ఖండిస్తూ హిజాబ్కు వ్యతిరేకంగా ఇరాన్లో నిరసనలు తారాస్థాయికి చేరాయి.