మెక్సికో సిటీ: ప్రారంభించిన వెంటనే ఒక వంతెన కూలిపోయింది. దీంతో ఆ నగర మేయర్, ఆయన భార్య, నగర పాలక మండలి సభ్యులు, అధికారులు, జర్నలిస్టులు పది అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. మెక్సికోలోని క్యూర్నావాకా నగరంలో ఈ సంఘటన జరిగింది. రాజధాని మెక్సికో సిటీకి సమీపంలోని అత్యంత జనరద్దీ ఉన్న ఆ నగరంలో సహజ, ప్రకృతి అందాల ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో భాగంగా ఒక నది వెంట నడక కోసం ఒక వంతెనను ఇటీవల నిర్మించారు. మధ్యలో నీటి ప్రవాహాల మీదుగా వేలాడేటట్లుగా చెక్క, మెటల్తో వంతెనను ఏర్పాటు చేశారు. మేయర్ జోస్ లూయిస్ ఉరియోస్టెగుయ్ దీనిని ప్రారంభించారు. అనంతరం తన భార్య, నగర పాలక మండలి సభ్యులు, అధికారులు, మీడియా సిబ్బందితో కలిసి దానిపై నడిచారు.
అయితే కాలువ మీదుగా ఉన్న వేలాడే వంతెన భాగం తెగిపోయింది. దీంతో మేయర్, ఆయన భార్యతో సహా 20 మందికిగా వ్యక్తులు పదడుగుల ఎత్తు నుంచి కింద ఉన్న కొండ రాళ్లు, కాలువ సమీపంలో పడ్డారు. నలుగురు సిటీ కౌన్సిల్ సభ్యులు, ఇద్దరు అధికారులు, ఒక స్థానిక రిపోర్టర్ సహా పలువురు తీవ్రంగా గాయపడినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. కాళ్లు, చేతులు, నడుము విరిగిన ఎనిమిది మందిని స్ట్రెచర్ల సహాయంతో ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
కాగా, వంతెన ప్రారంభానికి ముందే కొందరు ఆ వేలాడే చోట జంప్ చేసి ఉంటారని, అలాగే సామర్థ్యానికి మించి ఒకేసారి ఎక్కువ మంది దానిపై నడవడం వల్ల ఇలా జరిగి ఉంటుందని మేయర్ తెలిపారు. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Footbridge collapse during reopening ceremony in Mexico pic.twitter.com/Kn4X554Ydk
— Adrian Slabbert (@adrian_slabbert) June 9, 2022