కాబూల్, ఆగస్టు 31: ఉగ్రవాదాన్ని తుదముట్టించే పేరుతో రెండు దశాబ్దాల పాటు అఫ్గానిస్థాన్లో మకాం వేసిన అమెరికా సైన్యం వెనుదిరిగింది. విమోచనమో, నిర్బంధమో తెలియని అయోమయ పరిస్థితుల్లోకి అఫ్గాన్ పౌరుల భవిష్యత్తును నెట్టేస్తూ అగ్రరాజ్యం సంపూర్ణ బలగాల ఉపసంహరణను పూర్తిచేసింది. గతేడాది దోహాలో చేసుకున్న ఒప్పందం ప్రకారం గడువుకు ఒక్కరోజు ముందే ఈ ప్రక్రియను ముగించింది. అమెరికా రక్షణ దళాలతో కూడిన సీ17 విమానం సోమవారం అర్ధరాత్రి కాబూల్ విమానాశ్రయాన్ని వీడింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం ప్రకటించారు. మరోవైపు, అమెరికా సేనలు వెళ్లిపోగానే కాబూల్ ఎయిర్పోర్ట్ను తాలిబన్లు అదుపులోకి తీసుకున్నారు. తూటాలు పేల్చుతూ సంబురాలు చేసుకున్నారు. ‘అఫ్గాన్కు సంపూర్ణ స్వాతంత్య్రం లభించింద’ని నినదించారు. రన్వేపై పరేడ్లా నడుస్తూ విజయ సంకేతాలను చూపారు. ఈ క్రమంలో తాలిబన్ నేతలు మాట్లాడుతూ.. అఫ్గాన్ పౌరులకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్టు పునరుద్ఘాటించారు. దేశ భద్రతకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. అమెరికా సేనల ఉపసంహరణ తమ విజయమని పేర్కొన్నారు. ఆక్రమణదారులకు ఇదో గుణపాఠమన్నారు. అమెరికా బలగాల ఉపసంహరణ తీరు అత్యంత చెత్తగా ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు.
కొనసాగుతున్న రాక్షసత్వం
అమెరికా దళాల ఉపసంహరణతో అఫ్గాన్ను సంపూర్ణంగా హస్తగతం చేసుకున్న తాలిబన్లు దురాగతాలను మళ్లీ మొదలెట్టారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఊచకోత కోయడం ప్రారంభించారు. అమెరికాకు చెందిన ఓ హెలికాప్టర్లో తాలిబన్లు మంగళవారం కాందహార్ వినువీధుల్లో విహరించారు. ఆ హెలికాప్టర్కు ఓ వ్యక్తిని తాడు సాయంతో వేలాడదీయడం పలు వీడియోల్లో కనిపించింది. అతడిని చంపిన తర్వాతే తాలిబన్లు ఇలా చేశారని స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. కాగా, అఫ్గాన్ను విడిచి వెళ్లేకంటే ముందే ఎయిర్పోర్ట్, సైనిక స్థావరాల్లో ఉన్న తమ ఆయుధాలు, హుమ్వీ వాహనాలు, పలు హెలికాప్టర్లు, 73 విమానాలను నిర్వీర్యం చేశామని అమెరికా దళాలు పేర్కొన్నాయి. అయితే, కాందహార్లో అమెరికా హెలికాప్టర్లో తాలిబన్లు విహరించడం అమెరికా దళాల ప్రకటనపై అనుమానాలు కలిగేలా చేస్తున్నది.
పంజ్షీర్పై దాడులు.. 8 మంది తాలిబన్లు హతం
అమెరికా సేనలు అటు వెళ్లగానే పంజ్షీర్పై సోమవారం రాత్రి తాలిబన్లు దాడి చేశారు. అయితే ఫైటర్లను ఉత్తర కూటమి సేనలు సమర్థంగా అడ్డుకున్నాయి. ఘర్షణల్లో 8 మంది తాలిబన్లు హతమైనట్టు సమాచారం.
ఇంకా 2 వేల మంది ఉగ్రవాదులు
అఫ్గాన్లో ఇంకా 2 వేల మంది ఉగ్రవాదులు ఉన్నట్టు పెంటగాన్ అంచనా వేసింది. అఫ్గాన్లోని ఐసిస్-కే స్థావరాలపై దాడులు జరుపు తామని బ్రిటన్ ప్రకటించింది.
తాలిబన్లకు రక్షణగా ‘బద్రి 313’
అఫ్గాన్ను ఆక్రమణలోకి తీసుకున్న తాలిబన్లు.. తమ పాలనను వ్యతిరేకించే వారిని నిరోధించేందుకు కొత్త బెటాలియన్ను సిద్ధం చేశారు. ఆ దళమే ‘బద్రి 313’. అమెరికా సైనికుల మాదిరి మిలిటరీ యూనిఫాం, ఎం-4 రైఫిల్, నైట్ విజన్ పరికరాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను ఈ దళ సభ్యులు కలిగిఉన్నారు. 1400 ఏండ్ల క్రితం బదర్ యుద్ధంలో కేవలం 313 మంది యోధుల సాయంతో ప్రవక్త ముహమ్మద్ శత్రువులను తరిమికొట్టినట్టు చెబుతారు. అందుకే తాలిబన్లు ఈ దళానికి ‘బద్రి 313’గా పేరుపెట్టారు.
తాలిబన్లతో భారత్ చర్చలు
అఫ్గాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ పూర్తైన నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను తీసుకురావడానికి కేంద్రప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. ఈ మేరకు ఖతార్లో భారత రాయబారిగా ఉన్న దీపక్ మిట్టల్.. తాలిబన్ నాయకుడు షేర్ మహమ్మద్ అబ్బాస్ తో దోహాలో తొలిసారిగా మంగళవారం చర్చలు జరిపారు. భారత్కు వ్యతిరేకంగా, ఉగ్రవాద కార్యకలాపాలకు అఫ్గాన్ను ఉపయోగించవద్దని చర్చల్లో అబ్బాస్కు దీపక్ గుర్తుచేశారు. అఫ్గాన్ పరిణామాలపై విదేశాంగమంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో కూడిన బృందం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నది. తాలిబన్ల నేతృత్వంలోని అఫ్గాన్తో అన్ని దేశాలు సంబంధాలు పెట్టుకోవాలని చైనా సూచించింది.
ఇరాన్ తరహాలో పాలన!
మరోవారంలో తాలిబన్ల నేతృత్వంలో పూర్తిస్థాయిలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నట్టు సమాచారం. ఇరాన్ రాజకీయ వ్యవస్థను పోలిన ప్రభుత్వ ఏర్పాటు దిశగా తాలిబన్ నాయకులు చర్చలు సాగిస్తున్నట్టు తెలుస్తున్నది. సుప్రీం లీడర్గా హైబతుల్లా అకుంద్జాదాను ఎన్నుకోనున్నారు. కాగా ఇరాన్ రాజకీయ వ్యవస్థ నియంతృత్వ వ్యవస్థగా చెప్పుకోవచ్చు. దేశాధ్యక్షుడి స్థానం నామమాత్రమే. స్వతంత్ర అధికారాలు ఉండవు. రక్షణ, న్యాయ, ఆర్థిక, పరిపాలన, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ సుప్రీం లీడరే తీసుకుంటారు. ఎన్నికల నిర్వహణ కూడా ఈయన కనుసన్నల్లోనే జరుగుతుంది. ప్రభుత్వ నిర్వహణలో మతాధికారులు ప్రధాన పాత్ర పోషిస్తారు.