మాస్కో: రష్యా ఇటీవల విలీనం చేసుకున్న నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాల్లో మార్షల్ లా విధించారు. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం జరిగిన జాతీయ భద్రతా మండలి సమావేశంలో ఈ విషయాన్ని ఆయన తెలిపారు. ‘రష్యన్ ఫెడరేషన్లో విలీనమైన నాలుగు ప్రాంతాల్లో మార్షల్ లా ప్రవేశపెట్టే ఒక డిక్రీపై నేను సంతకం చేశాను. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రష్యన్ ప్రాంతాల అధిపతులకు అదనపు అధికారాలు ఇవ్వడం అవసరమని నేను భావిస్తున్నాను’ అని చెప్పారు.
కాగా, ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకుని బలవంతపు ప్రజాసేకరణతో విలీనం చేసుకున్న నాలుగు ప్రాంతాలైన లుహాన్స్క్, దొనేత్సక్, జపోరిజ్జియా, ఖెర్సన్లో మార్షల్ లా గురువారం ఉదయం నుంచి నుంచి అమలులోకి వస్తుందని రష్యా అధ్యక్షుడి కార్యాలయం తెలిపింది. ఉక్రెయిన్కు ఆనుకుని ఉన్న ఎనిమిది ప్రాంతాల వెలుపల కదలికలను నియంత్రిస్తామని చెప్పింది. క్రాస్నోడార్, బెల్గోరోడ్, బ్రయాన్స్క్, వొరోనెజ్, కుర్స్క్, రోస్టోవ్, క్రిమియా, సెవాస్టోపోల్ వంటి ఎనిమిది ఉక్రెయిన్ దక్షిణ ప్రాతాల్లో మార్షల్ లా విధించినట్లు వెల్లడించింది.
అలాగే ఉక్రెయిన్లో పోరాటాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వ సంస్థల మధ్య పరస్పర చర్యలను పెంచడానికి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించినట్లు ఆయన కార్యాలయం పేర్కొంది.