మాస్కో: ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి నెలకొల్పేందుకు ప్రపంచ దేశాల నేతలు చేస్తున్న ప్రయత్నాలపై వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్, భారత ప్రధాని మోదీలకు ఆయన థ్యాంక్స్ తెలిపారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్, మోదీలు నోబెల్ మిషన్ చేపట్టినట్లు తెలిపారు. ఉక్రెయిన్తో 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్న నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణపై చర్చలు చేపట్టేందుకు రష్యా సిద్ధంగా ఉందని, కానీ ఆ ఒప్పందానికి ముందు షరతులపై క్లారిటీ రావాలన్నారు.
2024 జూలైలో చేసిన ప్రతిపాదన ప్రకారం స్వల్పకాల పరిష్కారాలకు తాము అంగీకరించబోమని పుతిన్ పేర్కొన్నారు. కానీ యుద్ధ సంక్షోభాన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఉక్రెయిన్, రష్యా సమస్య పరిష్కారానికి అమెరికా ప్రతినిధులు కొన్ని రోజుల క్రితం సౌదీ అరేబియాలో భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ ప్రతినిధులతో నిర్వహించిన చర్చల్లో 30 రోజల కాల్పుల విరమణ ప్రతిపాదన వచ్చింది.
ఉక్రెయిన్తో కాల్పుల విరమణ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ముందు.. వివిధ దేశాధినేతలకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నట్లు గురువారం పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ఎంతో ప్రయత్నించారన్నారు. అన్ని దేశాలకు ఎన్నో సమస్యలు ఉన్నాయని, కానీ చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని, బ్రెజిల్ అధ్యక్షుడు, సౌతాఫ్రికా అధ్యక్షుడు.. ఎంతో మంది దేశాధినేతలు.. ఉక్రెయిన్ సమస్య పరిష్కారం కోసం ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నారని పేర్కొన్నారు. శాంతి కోసం కృషి చేసినవారందరికీ థ్యాంక్స్ చెబుతున్నట్లు పుతిన్ తెలిపారు. ఓ మంచి లక్ష్యం కోసం నేతలందరూ పనిచేస్తున్నారని, యుద్ధాన్ని నివారించేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రాణ నష్టం జరగకుండా చూస్తున్నారని పుతిన్ తెలిపారు.
దీర్ఘకాలిక శాంతి ఏర్పడే అవకాశం ఉంటేనే.. ఉక్రెయిన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తామని పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత ప్రధాని మోదీ పలు మార్లు పుతిన్, జెలెన్స్కీతో మాట్లాడారు. గత నెలలో వైట్హౌజ్లో ట్రంప్తోనూ ఈ అంశంపై మోదీ భేటీ అయ్యారు. రష్య, ఉక్రెయిన్ సంక్షోభంలో భారత్ తటస్థంగా ఉన్నట్లు చెప్పారు. ఇది యుద్ధం జరిపే యుగం కాదు అని, ట్రంప్ తీసుకునే చర్యను సమర్థిస్తున్నట్లు కూడా మోదీ పేర్కొన్నారు.