బీజింగ్: ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి ఒక్కరూ భయపడుతున్న పేరు కరోనా. దీని భయంతో మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం సాధారణ జీవితాల్లో భాగమైపోయింది. ఇలాంటి సమయంలో ఒక బ్యాంకుకు వచ్చిన మిలియనీర్ కనీసం మాస్కు పెట్టుకోలేదు.
ఇది చూసిన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డగించారు. మాస్కు ధరించకపోతే బ్యాంకులోకి అనుమతించడం కుదరదని తేల్చిచెప్పారు. ఈ సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తన సదరు మిలియనీర్కు నచ్చలేదట. అందుకే తన ఖాతాలోని డబ్బులన్నీ విత్ డ్రా చేసేయాలని డిసైడ్ అయ్యాడు.
అయితే బ్యాంకులో ఒక రోజుకు 50 లక్షల యువాన్లు (చైనీస్ కరెన్సీ) మాత్రమే విత్డ్రా చేసుకునే పరిమితి ఉంది. అంటే మన లెక్కల్లో రూ. 5.8 కోట్లు అన్నమాట. అందుకని ఒకేసారి అంత సొమ్మును విత్ డ్రా చేసిన ఈ మిలియనీర్.. తన డబ్బును బ్యాంకు సిబ్బంది స్వయంగా చేత్తో లెక్కలేసి ఇవ్వాలని హుకుం జారీ చేశాడు.
ఇలా మొత్తం రూ.5 కోట్లను లెక్కవేయడానికి ఇద్దరు బ్యాంకు అధికారులకు రెండు గంటలపైగా పట్టిందట. తన ఖాతాలో డబ్బు మొత్తం విత్ డ్రా చేసే వరకూ ప్రతిరోజూ ఇలానే చేస్తానని సదరు మిలియనీర్ చెప్పాడు. బ్యాంకు సిబ్బంది ప్రవర్తన చాలా ఛండాలంగా ఉందని, అందుకే తన డబ్బును ఆ బ్యాంకు నుంచి విత్ డ్రా చేసి వేరే బ్యాంకుల్లో వేయాలని తాను నిర్ణయించుకున్నానని అతను వెల్లడించాడు.
ఈ ఘటన చైనాలోని బ్యాంక్ ఆఫ్ షాంఘైలో జరిగింది. అయితే తమ సిబ్బందిలో ఎవరూ అనుచితంగా ప్రవర్తించలేదని, కేవలం సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఆ మిలియనీర్ను మాస్కు వేసుకోవాలని ఒత్తిడి చేశారని బ్యాంకు యాజమాన్యం తెలిపింది.
ఈ మిలియనీర్ మళ్లీ డబ్బు విత్ డ్రా చేయడానికి ఆ బ్యాంకుకు వెళ్లాడో లేదో తెలియదు కానీ, 5 కోట్ల రూపాయలను సూట్ కేసుల్లో సర్దుకొని లగ్జరీ కార్లో పెట్టుకుంటున్న అతని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారాయి.