కీవ్, ఏప్రిల్ 29: రష్యా నుంచి తమను, తమ రాజధాని కీవ్ను కాపాడుకోవడానికి దిమిదివ్ గ్రామ ప్రజలు అనూహ్య సాహసం చేశారు. తమ ఊరికి వరదను తెచ్చుకొన్నారు. రష్యా యుద్ధ ట్యాంకులు ముందుకు కదలకుండా చేశారు. దిమిదివ్ గ్రామం కీవ్కు ఉత్తరాన ఉంది. రష్యా బలగాలు యుద్ధ ట్యాంకులతో కీవ్ వైపు దూసుకువస్తున్న సమయంలో ఆ గ్రామ ప్రజలు అద్భుతమైన ఆలోచన చేశారు. సమీపంలోని నదికి మోటార్లు పెట్టి పెద్ద పెద్ద పైపుల సాయంతో గ్రామంలోని వీధులు, రోడ్లన్నింటినీ జలమయం చేశారు. ఊరంతా వరద నీటిలో చిక్కుకొన్నట్టుగా మార్చివేశారు. దీంతో రష్యా సేనలు ముందుకు కదల్లేకపోయాయి. వారు కీవ్ను చేరుకోవడం ఆలస్యమైంది. గ్రామంలో నీళ్లకు సంబంధించిన దృశ్యాలను ఉక్రెయిన్ ప్రభుత్వ అధికారి ఒకరు తాజాగా పోస్టు చేశారు. వీటిపై నెటిజన్లు స్పందిస్తూ గ్రామస్థుల సాహసాన్ని మెచ్చుకున్నారు.
రష్యా బలగాలకు ఎదురొడ్డుతున్న ఖేర్సన్ ప్రజలు..
రష్యా బరి తెగించింది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కీవ్ నగరంలో పర్యటిస్తున్న సమయంలోనే అక్కడ క్షిపణుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, గుటెరస్ మధ్య భేటీ జరిగి గంట కూడా కాకముందే నగరంపై విస్తృత దాడులకు దిగింది. పుతిన్ చర్యపై జెలెన్స్కీ మండిపడ్డారు. ‘అంతర్జాతీయ సంస్థలపై రష్యాకు ఏపాటి గౌరవం ఉందో చెప్పడానికి ఈ దాడులే నిదర్శనం’ అని వ్యాఖ్యానించారు. ఐరాసను అవమానించడానికి రష్యా ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. దీనికి బలమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. కీవ్పై రష్యా జరిపిన క్షిపణి దాడుల్లో రేడియో లిబర్టీ వార్తా సంస్థ జర్నలిస్టు విరా హైరిచ్ చనిపోయారు. దాడుల సమయంలో ఆమె ఇంట్లోనే ఉన్నారు.
రష్యా దాడుల్లో కీవ్లోని రాకెట్ల తయారీ ప్లాంటు ధ్వంసమైంది. మరియుపోల్లో ఉన్న అజోవ్స్టల్ స్టీల్ ప్లాంట్లోని ప్రజలను తరలించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నట్టు ఉక్రెయిన్ తెలిపింది. మరోవైపు ఖేర్సన్ నగరంలో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అక్కడి పౌరులు రష్యా సేనలకు ఎదురు తిరుగుతున్నారు. మార్చి మొదటి వారంలోనే ఖేర్సన్ నగరం రష్యా వశమైంది. ఉక్రెయిన్ బలగాలు లేనప్పటికీ స్థానిక ప్రజలు ఇంకా పోరాటం సాగిస్తున్నారు. రష్యా యుద్ధ నేరాలపై ఆధారాలను సేకరించడానికి నిపుణుల బృందాన్ని ఉక్రెయిన్కు పంపిస్తామని బ్రిటన్ వెల్లడించింది. ఉక్రెయిన్ దర్యాప్తునకు సహకరిస్తామని పేర్కొన్నది. యుద్ధం ముగియడానికి చాలా ఏండ్లు పట్టవచ్చని నాటో డిప్యూటీ సెక్రటరీ జనరల్ మిర్సియా అభిప్రాయపడ్డారు.
వారిని క్లినికల్ ట్రైనింగ్కు అనుమతించండి
కరోనా నేపథ్యంలో చైనా నుంచి, యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన భారతీయ వైద్య విద్యార్థులకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. ఇక్కడ వైద్య విద్యను పూర్తి చేసేందుకు అవకాశం కల్పించింది. విదేశాల్లో వైద్య విద్య పూర్తైనప్పటికీ, శిక్షణ పూర్తి కాకుండా అర్ధంతరంగా ఆపేసి వచ్చిన విద్యార్థులు ఇక్కడ క్లినికల్ ట్రైనింగ్ పూర్తి చేసేందుకు అనుమతించాలని నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)ను ఆదేశించింది. ఇందు కోసం రెండు నెలల్లో మార్గదర్శకాలను రూపొందించాలని పేర్కొన్నది. క్లినికల్ ట్రైనింగ్ పూర్తి కాకుండా వారిని ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లుగా రిజిస్టర్ చేయడం సరికాదని స్పష్టం చేసింది.