న్యూయార్క్: వెనిజులా దేశం నుంచి సుమారు 50 మిలియన్ బ్యారెళ్ల ఇంధనాన్ని కొనుగోలు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తాజాగా ప్రకటన చేశారు. అయితే మార్కెట్ ధరకే వెనిజులా ఆ ఇంధనాన్ని అమ్మనున్నట్లు పేర్కొన్నారు. హై క్వాలిటీ ఆయిల్ అమ్మకం తక్షణమే ప్రారంభం అవుతుందన్నారు. వెనిజులా దేశాధ్యక్షుడు మదురోను కొన్ని రోజుల క్రితం అమెరికా దళాలు నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెనిజులా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆ దేశం నుంచి ఆయిల్ ఖరీదు చేయనున్నట్లు చెప్పారు. వెనిజులా ప్రజల బెనిఫిట్ కోసం ఆ డబ్బును ఖర్చు చేస్తారని ట్రంప్ తెలిపారు. అమెరికాలోని అన్లోడింగ్ డాక్స్కు ఆ ఇంధన నౌకలను తరలిస్తారని ట్రంప్ పేర్కొన్నారు.
వెనిజులా ఇంధనాన్ని అమ్మే ప్రక్రియ పనులను ఎనర్జీ మంత్రి క్రిస్ రైట్ చూసుకుంటున్నారన్నారు. వెనిజులా ఆయిల్ పరిశ్రమ గురించి చర్చించేందుకు అమెరికా ఆయిల్ కంపెనీ పెద్దలు త్వరలో ట్రంప్తో భేటీకానున్నారు. చెవ్రాన్, కొనాకోఫిలిప్స్, ఎక్సాన్మోబిల్ లాంటి కంపెనీలు త్వరలో ట్రంప్ను కలవనున్నాయి. బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది. మదురో, ఆయన భార్యను బంధించిన అమెరికా.. కారకస్లో ప్రభుత్వాన్ని నడపనున్నట్లు చెప్పింది. ఒకవేళ అవసరం అయితే మళ్లీ పెనుదాడి చేయనున్నట్లు తెలిపారు.
వెనిజులాలో సుమారు 300 బిలియన్ బ్యారెళ్ల ఇంధన నిక్షేపాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అమెరికా కన్నా నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు. వాస్తవానికి 1990 దశకంలో ప్రతి రోజు 3.5 మిలియన్ బ్యారెళ్ల ఇంధనాన్ని వెనిజులా తోడేది. కానీ ఆ సామర్థ్యం క్రమంగా తగ్గింది. అవినీతి పెరిగిపోవడంతో పంపింగ్ 8 లక్షల బ్యారెళ్లకు తగ్గిపోయింది. అయితే ఇప్పుడు అమెరికా కంపెనీలు మళ్లీ వెనిజులాలో ఇంధన పరిశ్రమను బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే బిలియన్లలో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు. దెబ్బతిన్న వెనిజులా చమురు వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టనున్నట్లు ట్రంప్ చెప్పారు. కానీ ఇప్పటి వరకు అమెరికా ఆయిల్ కంపెనీలు దీనిపై ప్రకటన చేయలేదు.