న్యూఢిల్లీ : ఉక్రెయిన్పై రష్యా దాడులతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్ధితిలో అక్కడున్న భారత విద్యార్ధులు బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు. ఉక్రెయిన్ నుంచి తమను స్వస్ధలాలకు పంపాలని దేశ రాజధాని కీవ్లో చిక్కుకున్న విద్యార్ధిని భారత రాయబార కార్యాలయానికి పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదని వాపోయారు. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మోదీ సర్కార్పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న తమ విద్యార్ధులను ఇతర దేశాలు సురక్షితంగా వారి స్వస్ధలాలకు తరలించగా భారత ప్రభుత్వం మాత్రం ఈ దిశగా చేసింది శూన్యమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకంతో 15,000 మందికి పైగా భారత విద్యార్ధులు ఉక్రెయిన్లో చిక్కుకుపోయారని వరుణ్ గాంధీ అన్నారు.
ఇలాంటి సంక్షోభ సమయంలో భారత పౌరులకు సాయం చేయడం మోదీ ప్రభుత్వ కనీస బాధ్యతని ఆయన హితవు పలికారు. ఇక పశ్చిమ ఉక్రెయిన్కు వెళ్లాలని భారత రాయబార కార్యాలయం చేస్తున్న సూచనలను ఉక్రెయిన్లో చిక్కుకున్న బాధిత విద్యార్ధిని ప్రస్తావిస్తూ సరిహద్దులకు తాము 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నామని, అధికారుల సాయం లేకుండా అంతదూరం ప్రయాణించడం కష్టసాధ్యమని బాధిత విద్యార్ధిని పేర్కొన్నారు. తాము భారత రాయబార కార్యాలయ సిబ్బందికి ఫోన్లు చేసినా ఆయన తమ కాల్స్ను తిరస్కరిస్తున్నారని తన లాగే ఇక్కడ పలువురు భారత విద్యార్ధినీ, విద్యార్ధులు చిక్కుకుపోయారని ఆమె పేర్కొన్నారు.
కీవ్లో ఉన్నవారంతా రైళ్లలో బయటపడాలని ఈ మద్యాహ్నం ఎంబసీ అధికారులు సూచించారని తమకు సరైన మార్గదర్శకాలు అందించాల్సిన అధికారులు తమను పూర్తిగా విస్మరిస్తున్నారని విద్యార్ధిని ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దుల నుంచి భారత విద్యార్ధులను బయటకు తరలిస్తున్నామని రాయబార కార్యాలయ సిబ్బంది చెబుతున్నారని..అయితే తామున్న ప్రాంతం నుంచి సరిహద్దు 800 కిలోమీటర్ల దూరంలో ఉందని..విద్యార్ధులుగా తాము సరిహద్దులకు ఎలా వెళ్లగలుగుతామని ప్రవ్నించారు. భారత ప్రభుత్వం తమకు ఎంతమాత్రం సహకరించడం లేదని ఆమె ఆరోపించారు.