సమర్థంగా పనిచేస్తాయంటున్న అధ్యయనాలు
లండన్: క్యాన్సర్ రోగులకు కొవిడ్ వ్యాక్సిన్లు ఇవ్వడం సురక్షితమేనని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా సమర్థంగా నిరోధించగలిగే తగిన రక్షణాత్మక వ్యవస్థ క్యాన్సర్ రోగుల్లో ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఆధారాల గురించి యూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ ఆంకాలజీ వార్షిక మహాసభ ద్వారా ప్రపంచ ప్రజానీకానికి వివరించారు. బూస్టర్ డోస్ను ఇవ్వడం ద్వారా క్యాన్సర్ రోగుల్లో రక్షణ వ్యవస్థ సామర్థ్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ల అభివృద్ధి కోసం ఇప్పటివరకు నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్లో క్యాన్సర్ రోగులకు చోటు కల్పించలేదు.ఈ నేపథ్యంలో తాజా అధ్యయనానికి ప్రాధాన్యం ఏర్పడింది.
ఆ విద్యార్థులకు పరీక్ష ఫీజు రద్దు: సీబీఎస్ఈ
న్యూఢిల్లీ: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థుల నుంచి ఎలాంటి రిజిస్ట్రేషన్/పరీక్ష ఫీజును వసూలు చేయబోమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మంగళవారం తెలిపింది. వచ్చే ఏడాది 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నది. తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థుల జాబితాను ఆయా పాఠశాలలు అందజేస్తాయని తెలిపింది.
చిన్నారులపై కొవాగ్జిన్ ట్రయల్స్ పూర్తి
హైదరాబాద్: 18 ఏండ్లలోపు పిల్లల కోసం రూపొందించిన కొవాగ్జిన్పై 2/3 దశ ప్రయోగాలు పూర్తయినట్టు హైదరాబాద్ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ ప్రకటించింది. వెయ్యి మంది వలంటీర్లపై ఈ ట్రయల్స్ నిర్వహించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రయోగాలకు సంబంధించిన డాటాను విశ్లేషిస్తున్నామని, దీన్ని వచ్చే వారం భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కి అందజేయాలని భావిస్తున్నామని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సీఎండీ కృష్ణ ఎల్లా మంగళవారం హైదరాబాద్లో వెల్లడించారు. ఇప్పటికే వయోజనులకు (18 ఏండ్లు పైబడినవారికి) అందుబాటులో ఉన్న కొవాగ్జిన్ ఉత్పత్తిని మరింత పెంచుతున్నట్టు చెప్పారు. సెప్టెంబర్లో 3.5 కోట్ల డోసుల కొవాగ్జిన్ను ఉత్పత్తి చేశామని, అక్టోబర్లో ఈ ఉత్పత్తి 5.5 కోట్ల డోసులకు చేరుతుందన్నారు.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు పరిశోధకులు తెలిపారు. వైరస్ వ్యాప్తిని సూచించే ఆర్ విలువ ఆగస్టు చివరినాటికి 1.17 ఉండగా.. ఈ నెల మధ్యనాటికి (15వ తేదీ నాటికి) 0.92కు తగ్గిందని చెప్పారు. క్రియాశీల కేసులు అధికంగా ఉన్న కేరళ, మహారాష్ట్రల్లోనూ ఆర్ విలువ ఒకటిలోపే ఉన్నదని వెల్లడించారు. కాకపోతే ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఆర్ విలువ 1కంటే కొంచెం ఎక్కువగా ఉన్నదన్నారు. దేశవ్యాప్తంగా చూస్తే ఆర్ విలువ తగ్గడం శుభపరిణామమని పేర్కొన్నారు.