Donald Trump : అమెరికా, ఇరాన్ మధ్య చర్చల ప్రతిపాదన వచ్చిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు తమ షరతుల్ని ప్రకటించాయి. అయినప్పటికీ, ఇంకా చర్చలు ముందుకు కదలడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్కు కీలక హెచ్చరిక జారీ చేశారు. దౌత్యపరమైన చర్యలు విఫలమైతే ఇరాన్పై మరింత భారీ సైనిక దాడులుంటాయని హెచ్చరించారు. ఈ మేరకు సైనికపరంగా దాడి చేసేందుకు ఉన్న అవకాశాల్ని ట్రంప్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలపై ట్రంప్ మాట్లాడారు.
అమెరికాతో ఒప్పందానికి ఇరాన్ ప్రాధేయపడుతోందని ట్రంప్ అన్నారు. ప్రస్తుతం దౌత్యపరమైన చర్చల అంశం ఇంకా కొలిక్కిరానప్పటికీ, ఇరాన్ అమెరికాతో ఒప్పందం కోసం ప్రయత్నిస్తోందన్నారు. ఇరాన్ మిలిటరీ కోలుకునే అవకాశమే లేదని, కానీ, వారు చర్చల ప్రతిపాదనలు వింతగా, ఆశ్చర్యకరంగా ఉన్నాయన్నారు. ‘‘ఇరాన్ ప్రతినిధులు అమెరికా ప్రతిపాదన కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొంటున్నారు. వారు తప్పు చేస్తున్నారు. చర్చల అంశం మరీ ఆలస్యం కాకముందే మేల్కోవడం మంచిది. ఇంకా ఆలస్యమైతే మంచిదికాదు. ఒక్కసారి మొదలైతే అమెరికా వెనుదిరిగే ప్రసక్తే లేదు’’ అని ట్రంప్ అన్నారు. అలాగే, ఇరాన్కు నాయకత్వం వహించమని తనను అడిగినట్లు కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. మరోవైపు నాటో దేశాలపై కూడా ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ మండిపడ్డారు. నాటో దేశాలు ఈ యుద్ధంలో ఏమీ చేయలేకపోయాయని, కానీ, ఇరాన్ సైన్యం మొత్తం అంతమైపోయిందని అన్నారు.
తమకు నాటో సాయం అవసరం లేదని, కానీ, కీలక సమయంలో వారి వైఖరిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామని ట్రంప్ పేర్కొన్నారు. ఇక, ఇరాన్, అమెరికా మధ్య చర్చలు మధ్యవర్తుల ద్వారా, పరోక్షంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా 15 అంశాలతో కూడిన షరతుల్ని ఇరాన్కు పంపింది. ఇరాన్ కూడా కొన్ని షరతుల్ని విధించింది. చర్చల ప్రతిపాదన అంశాన్ని పరిశీలిస్తున్నామని, ప్రస్తుతానికి యుద్ధం ముగించేందుకు చర్చలు జరిపే అవకాశం లేదని ఇరాన్ తెలిపింది.