కీవ్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఆకస్మికంగా ఉక్రెయిన్(Ukraine)లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఎటువంటి హడావుడి లేకుండానే చాలా సైలెంట్గా ఆయన జర్నీ కొనసాగింది. అంత రహస్యంగా అగ్రరాజ్య అధ్యక్షుడు ఎలా వచ్చారో ఎవరికీ అర్ధం కాలేదు. ఆ డేరింగ్ జర్నీకి చెందిన కొన్ని వివరాలను వైట్హౌజ్(White House) తాజాగా వెల్లడించింది.
రష్యా(Russia) దాడులతో వణికిపోతున్న ఉక్రెయిన్ రాజధాని కీవ్(Kyiv)లో బైడెన్ అడుగుపెట్టడం నిజంగా పెద్ద స్టంటే. సోమవారం ఉదయం కీవ్లో కొంత అలజడి కనిపించినా.. ఎందుకు సైరన్లు మోగుతున్నాయో అక్కడ ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎవరో పెద్ద వ్యక్తి వస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నా.. వచ్చేది బైడెన్ అని తెలిసేందుకు చాలా టైం పట్టింది.
వాషింగ్టన్లోని ఆండ్రూస్ బేస్ నుంచి ఉదయం 4 గంటలకు బైడెన్ విమానంలో పోలాండ్కు బయలుదేరారు. ఆ దేశ రాజధాని వార్సాకు చేరుకున్న ఆయన అక్కడ నుంచి ప్రత్యేక రైలులో కీవ్కు ప్రయాణించారు. దాదాపు 10 గంటల పాటు ఆ జర్నీ సాగింది. వార్తో సతమతం అవుతున్న ఉక్రెయిన్కు బైడెన్ వస్తున్న విషయాన్ని గోప్యంగా ఉంచారు. దాదాపు అయిదు గంటల పాటు కీవ్లో బైడెన్ గడిపారు. ఆధునిక చరిత్రలో అమెరికా అధ్యక్షుడు అసాధారణ జర్నీ చేసినట్లు వైట్హౌజ్ వెల్లడించింది.
గతంలో ఇరాక్, ఆఫ్ఘన్ దేశాలకు కూడా అమెరికా అధ్యక్షులు ఆకస్మికంగా వెళ్లారు. ఆ సమయాల్లో అమెరికా సైన్యం అండగా నిలిచింది. కానీ కీవ్ టూర్ సమయంలో అసలు అమెరికా భద్రతా దళం ఏమాత్రం కనిపించలేదు. బైడెన్ రిస్కీ జర్నీ చేశారని, దీంట్లో ఎవరూ అనుమానం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని వైట్హౌజ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కేట్ బెడింగ్ఫీల్డ్ తెలిపారు.
కీవ్ టూర్కు వెళ్లాలన్న దానిపై శుక్రవారమే ఫైనల్ నిర్ణయం తీసుకున్నట్లు వైట్హౌజ్ వర్గాలు తెలిపాయి. కేవలం పోలాండ్కు మాత్రమే బైడెన్ వెళ్తున్నట్లు ఆదివారం కూడా బ్రీఫింగ్ ఇచ్చారు. కానీ ఎయిర్ ఫోర్స్ వన్ టేకాఫ్ సమయంలో కొందరు మాత్రమే అధికారులు ఉన్నారు. మెడికల్ టీమ్, సెక్యూర్టీ ఆఫీసర్లతో ఆ విమానం బయలుదేరింది. అధ్యక్షుడు బైడెన్తో కేవలం ఇద్దరు జర్నలిస్టులకు మాత్రమే అవకాశం కల్పించారు. వాళ్ల వద్ద నుంచి మొబైల్ ఫోన్లను తీసుకుని మరీ ప్లేన్ ఎక్కిచారు. కీవ్లో బైడెన్ అడుగుపెట్టిన తర్వాతే ఆ జర్నలిస్టులకు వార్తలను రాసే అవకాశం కల్పించారు.
అయితే కీవ్కు బైడెన్ వెళ్లడానికి కొన్ని గంటల ముందు మాత్రం రష్యాకు సమాచారాన్ని చేరవేసినట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివన్ తెలిపారు. వార్సా నుంచి కీవ్కు ట్రైన్లో బైడెన్ 10 గంటలు జర్నీ చేయడం గొప్ప విషయమని వైట్హౌజ్ అధికారులు చెప్పారు.