వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్నది. దేశంలో కొత్తగా నమోదవుతున్న కేసులు సగానికిపైగా ఈ రకానికి చెందినవే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే జనవరి చివరి నాటికి ఒమిక్రాన్ కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్య సలహదారు ఆంథోనీ ఫౌసీ హెచ్చరించారు.
అతిపెద్ద దేశం కావాడంతోపాటు టీకాలో వైవిధ్యం కారణంగా వైరస్ వ్యాప్తికి మరో రెండు వారాల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నానని చెప్పారు. జనవరి చివరి నాటికి ఒమిక్రాన్ కేసులు అత్యధికానికి చేరే అవకాశం ఉందన్నారు.
దేశవ్యాప్తంగా గత వారం రోజుల్లో నమోదైన కొత్త ఇన్ఫెక్షన్లలో 58.6 శాతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులే ఉన్నాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించింది. అమెరికాలో రోజుకు సగటున 2,40,400 కరోనా కేసులు నమోదవుతున్నాయని సీడీసీ డైరెక్టర్ రోచెల్ వాలెన్స్కీ తెలిపారు. ఇది గత వారంతో పోలిస్తే 60 శాతం అధికమని పేర్కొన్నారు.
కరోనా కొత్త రూపమైన ఒమిక్రాన్ వేరియంట్ మొదటిసారిగా దక్షిణాఫ్రకాలో వెలుగులోకి వచ్చింది. క్రమంగా అది ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్నది. డెల్టా వేరియంట్ కంటే స్పీడ్గా ఇది వ్యాప్తిచెందుతున్నది. అయితే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు సైతం ఈ వేరియంట్ బారిన పడుతుండటం గమనార్హం.