US vs Iran : ఇరాన్ (Iran) పై అమెరికా (USA) చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ లో అగ్రరాజ్య సైన్యానికి భారీనష్టం జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 39 రోజులపాటు యుద్ధం కొనసాగగా.. అగ్రరాజ్యానికి చెందిన 39 విమానాలను ఇరాన్ ధ్వంసం చేసింది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ (Israel) తో కలిసి ఇరాన్ (Iran) పై అగ్రరాజ్యం విరుచుకుపడటంతో పశ్చిమాసియా (West Asia) లో యుద్ధజ్వాలలు (US-Iran Conflicts) చెలరేగాయి. ఇరాన్ ప్రతీకార దాడులతో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి.
ఐదు వారాలకుపైగా కొనసాగిన ఈ ఘర్షణల్లో యూఎస్కు చెందిన 39 విమానాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. మరో 10 విమానాలు వివిధ స్థాయిల్లో దెబ్బతిన్నట్లు సమాచారం. కూలిన అమెరికా విమానాల్లో ఒక ఏ-10, నాలుగు ఎఫ్-15 స్ట్రైక్ ఈగిల్ యుద్ధవిమానాలు ఉన్నాయి. ఇరాన్ గగనతలంలో అమెరికా ఎఫ్-35 స్టెల్త్ యుద్ధవిమానం ఒకటి దెబ్బతిన్నది. అగ్రరాజ్యం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ ఐదోతరం యుద్ధ విమానం పోరాటంలో శత్రుదాడికి గురికావడం ఇదే తొలిసారి.
సౌదీ అరేబియాలోని ఓ వైమానిక స్థావరంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో ఐదు కేసీ-135 రీఫ్యూయలింగ్ విమానాలు దెబ్బతిన్నాయి. అయితే వాటిల్లో కొన్నింటికి మరమ్మతులు చేశారు. సౌదీ వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో అగ్రరాజ్యానికి చెందిన అత్యాధునిక ‘బోయింగ్ ఈ-3 సెంట్రీ నిఘా విమానం కూడా తీవ్రంగా ధ్వంసమైంది. ఇక యూఎస్కు చెందిన నాలుగు F-15E ఫైటర్ జెట్లు కూడా కూలిపోయాయి. వీటిల్లో మూడు కువైట్లో జరిగిన ‘ఫ్రెండ్లీ ఫైర్’ లో భాగంగా కూలినట్లు యూఎస్ సెంటకామ్ పేర్కొన్నది.
కువైట్లోని అమెరికా స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో ఒక CH-47 చినూక్ హెలికాప్టర్ ధ్వంసమైందని ఇరాన్ మీడియా తెలిపింది. ఇవిగాక ఈ ఘర్షణల్లో అమెరికాకు చెందిన డ్రోన్ విభాగానికి భారీగా నష్టం జరిగింది. దాదాపు 24 MQ-9A రీపర్ డ్రోన్లు ధ్వంసమయ్యాయి.