న్యూఢిల్లీ: అమెరికా-ఇరాన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉద్దేశించిన అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ గురువారం సంతకం చేశారు. చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఒప్పందంపై సంతకం చేశారని ఆయన కార్యాలయం తెలిపింది. హొర్ముజ్ జలసంధి తక్షణమే తెరుచుకుంటుందని పేర్కొన్నది. జీ7 శిఖరాగ్ర సమావేశం అనంతరం వెర్సైల్స్ ప్యాలెస్లో జరిగిన విందులో ట్రంప్ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య తరచుగా జరుగుతున్న ఫోన్ సంభాషణలు శత్రుత్వంగా మారడం ప్రారంభించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొన్నది. నెతన్యాహు అందరిపై బాంబులు వేయాలనుకుంటున్నారు అంటూ ట్రంప్ తన సలహాదారుల వద్ద అసహనం వ్యక్తం చేసినట్లు ఈ వ్యాఖ్యలను స్వయంగా విన్న ఒక వ్యక్తిని ఉటంకిస్తూ పత్రికా కథనం పేర్కొన్నది. అంతేగాకుండా సైనిక చర్య కోసం నెతన్యాహు నిరంతరం చేస్తున్న అభ్యర్థనల పట్ల ట్రంప్ విసిగిపోయారు. ఇలా ఉండగా అమెరికా తన హామీలను గౌరవించకపోతే ఇరాన్ కూడా తన హామీలను గౌరవించబోదని ఒప్పందంపై సంతకాలు జరిగిన కొన్ని గంటలకే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, ప్రధాన చర్చల అనుసంధానకర్త ఒహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ హెచ్చరించినట్లు ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ)కి చెందిన మీడియా పేర్కొన్నది.
అమెరికా-ఇరాన్ తుది ఒప్పందాన్ని ప్రభావితం చేయడానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రయత్నిస్తున్నట్లు ఇజ్రాయెలీ మీడియా వెల్లడించింది. వాషింగ్టన్లోని ప్రముఖ మితవాద వ్యాఖ్యాతలు, ఇజ్రాయెల్ అనుకూల చట్టసభ సభ్యుల ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై ఒత్తిడి తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ ,లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నది. దక్షిణ లెబనాన్లో గురువారం ఇజ్రాయెలీ సైన్యం జరిపిన దాడుల్లో ముగ్గురు పౌరులు మరణించినట్లు నేషనల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.