Iran vs US : ఇరాన్ (Iran) పై ఇజ్రాయెల్ (Israel), అమెరికా (USA) దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. దాంతో ఇవాళ భారత్ నుంచి వెళ్లాల్సిన దాదాపు 400కు పైగా విదేశీ విమానాలను రద్దుచేశారు. ఈ విషయాన్ని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (Civil Aviation Ministry) వెల్లడించింది.
మొత్తం ఎన్ని విమానాలు రద్దయ్యాయి..? ఇంకా ఎన్ని రద్దు కానున్నాయి..? ఎన్ని ఆలస్యంగా నడుస్తున్నాయనే విషయంపై విమానయాన సంస్థల అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు పౌరవిమానయాన శాఖ తెలిపింది. విమానాల రద్దు నేపథ్యంలో విమానాశ్రయాల్లోని టెర్మినల్స్ వద్ద ప్రయాణికులకు సహకారం అందించేందుకు, క్రౌడ్ మేనేజ్మెంట్ నిర్వహణకు పలువురు సీనియర్ అధికారులను నియమించినట్లు విమానయాన శాఖ తెలిపింది.
ప్రయాణికుల ఫిర్యాదులను నమోదు చేయడానికి తాము ఏర్పాటు చేసిన డిజిటల్ ఫిర్యాదుల
పరిష్కార వేదిక ‘ఎయిర్సేవ’కు 216 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. వాటిలో 105
ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. ప్రయాణికుల భద్రత, కార్యాచరణ నిబంధనలను కచ్చితంగా పాటించేలా విమానయాన సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) వెల్లడించింది.
విమానాల మళ్లింపులు, రద్దు నేపథ్యంలో ప్రయాణికులకు తగిన సదుపాయాలు కల్పించాలని దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు సూచించినట్లు తెలిపింది. మరో వైపు ఆదివారం సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు
అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసినట్లు దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా
ప్రకటించింది. వీటిలో లండన్, షికాగో, టొరంటో, న్యూయార్క్, పారిస్ వంటి నగరాలు ఉన్నట్లు తెలిపింది.
దోహా నుంచి వెళ్లాల్సిన అన్ని విమానాలను రద్దు చేసినట్లు ఖతార్ ఎయిర్లైన్స్ ప్రకటన విడుదల చేసింది.