వాషింగ్టన్: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణతో అల్లాడుతున్న భారత్కు ఇప్పటివరకు 50 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం అందించినట్లు అమెరికా అధ్యక్ష భవనమైన శ్వేతసౌధం వెల్లడించింది. ఈ మేరకు బుధవారం వైట్హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక ముందు కూడా భారత్కు సహాయ సహకారాలు కొనసాగించనున్నట్లు తెలిపింది. అంతేకాక వివిధ దేశాలకు 8 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపించనున్నట్లు కూడా వైట్హౌస్ మీడియా కార్యదర్శి జెన్ సాకీ తెలిపారు.
‘అధ్యక్షుడు జో బైడెన్ సారథ్యంలో దక్షిణాసియా దేశాలకు మా సాయం అందించేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే వివిధ దేశాలకు ఆక్సిజన్, మాస్కులు, టెస్టింగ్ కిట్లు, మందులు పంపాం. త్వరలో పంపనున్న 8 కోట్ల వ్యాక్సిన్ డోసుల్లో 6 కోట్లు ఆస్ట్రాజెనికా, మరో 2 కోట్లు ఇతర వ్యాక్సిన్లను పంపుతాం. ఇంటిలిజెన్స్ నివేదికల ఆధారంగా భారత్తో పాటు, అవసరం ఉన్న ఇతర దేశాలకు తగినన్ని వ్యాక్సిన్లు పంపిణీ చేస్తాం’ అని జెన్ సాకీ తెలిపారు.