వాషింగ్టన్: జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో (Pahalgam Attack) పర్యాటకులను ఊచకోత కోసిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)ను అగ్రరాజ్యం అమెరికా ఉగ్ర సంస్థగా ప్రకటించింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు అది ముసుగు సంస్థ అని పేర్కొన్నది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. హిందువులను లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడింది తామేనంటూ టీఆర్ఎఫ్ ప్రకటించుకున్నది. ఈ నేపథ్యంలో టీఆర్ఎఫ్ను అమెరికా విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
ది రెసిస్టెంట్ ఫ్రంట్ను విదేశీ ఉగ్రవాద సంస్థ (FTO)గా, ప్రత్యేకంగా నియమితమైన గ్లోబల్ టెర్రరిస్ట్ (SDGT) ఆర్గనైజేషన్గా అమెరికా గుర్తిస్తున్నట్లు మార్కో రూబియో ప్రకటించారు. 2008 ముంబై ఉగ్రదాడి తర్వాత భారత్లో చోటుచేసుకున్న దాడుల్లో పహల్గాం ఘటనే అతిపెద్దదని చెప్పారు. భారత భద్రత దళాలపై గతంలో జరిగిన పలు దాడులకు టీఆర్ఎఫ్ బాధ్యత వహించిందన్నారు. కాగా, పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్పై దాడులు చేపట్టి ఉగ్రమూకల క్యాంపులను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
టీఆర్ఎఫ్ 2019లో లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా ఏర్పడింది. ఇది లష్కరేకు ఉన్న మరో పేరుతప్ప మరేమీకాదు. . పుల్వామా దాడి, జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (TATF) పరిశీలన నుంచి తప్పించుకునేందుకు పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వ్యూహకర్తలు టీఆర్ఎఫ్ అనే పేరుతో లష్కరే కోర్ గ్రూప్ను తెరపైకి తెచ్చారు. గత మూడునాలుగేండ్లుగా జమ్ముకశ్మీర్లో వలస కార్మికులు, కశ్మీరీ పండిట్లతోపాటు సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నది. 2021 జూన్లో జమ్ములోని ఇండియన్ ఎయిర్ఫోర్స్ (IAF) స్టేషన్పై డ్రోన్ దాడులు చేసింది. ఈ నేపథ్యంలో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద 2023 జనవరిలో టీఆర్ఎఫ్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 2022లో దీని కమాండర్ సజ్జాద్ గుల్ను ఉగ్రవాదిగా ప్రకటించింది.