Joe Kent : ఇరాన్తో యుద్ధం సాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వంలో అమెరికా కౌంటర్ టెర్రరిజం చీఫ్గా ఉన్న జో కెంట్ తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. ఇరాన్పై జరుగుతున్న ఈ యుద్ధాన్ని తాను సమర్ధించడం లేదని, ఇందుకు తన అంతరాత్మ ఒప్పుకోదని జో కెంట్ అన్నారు. ఇప్పటికిప్పుడు ఇరాన్ నుంచి అమెరికాకు ఎలాంటి ముప్పు లేదని, అందువల్ల అమెరికాకు ఈ యుద్ధం అవసరం లేదన్నాడు.
అయితే, ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే ఇరాన్పై అమెరికా యుద్ధానికి దిగిందని కెంట్ స్పష్టం చేశారు. అమెరికాకు ఇజ్రాయెల్ అతిపెద్ద లాబీయింగ్ చేసే దేశమన్నారు. అయితే, విదేశాలకు సంబంధించి ఇప్పటివరకు ట్రంప్ అనుసరించిన విధానాల్ని తాను సమర్ధి్స్తానని కెంట్ తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్కు కీలక సూచనలు చేశాడు. ‘‘2016, 2020, 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ చెప్పిన విషయాలు, విలువలకు నేను మద్దతుగా ఉన్నాను. 2025 జూన్ వరకు మిడిల్ ఈస్ట్ యుద్దాలు ఒక ట్రాప్లాగా భావించే వారు. వాటివల్ల అమెరికా సంపదకు నష్టం కలుగుతుందని, అమెరికా దేశ భక్తులైన సైనికుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని, మనకు ఆర్థికంగా నష్టం కలుగుతుందని భావించేవారు. ట్రంప్ మొదటి పాలనలో ఇతర ఆధునిక అధ్యక్షులకన్నా గొప్పగా ఆలోచించి, మన సైన్యాన్ని ఎలాంటి యుద్ధంలోకి పంపలేదు.
ఐసిస్ సంస్థను, క్వాసం సోలామని లాంటి వారిని అంతం చేసి మరీ ఇది నిరూపించారు. అయితే, రెండోసారి ఎన్నికైన తర్వాత ఇజ్రాయెల్ ప్రభావంతో ఇరాన్ను ముప్పుగా భావించారు. దీంతో ఈ యుద్ధం మొదలైందని, వేలాది మంది అమెరికన్ సైనికుల ప్రాణాలు పణంగా పెట్టారు’’ అని కెంట్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ పరిస్తితిని సరిదిద్ది అమెరికాకు ఒక చక్కని దారి చూపాలని తన లేఖలో కోరాడు. అధ్యక్షుడు ట్రంప్ పాలనలో పని చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపాడు.