వాషింగ్టన్ : గర్భంతో ఉన్న ఉద్యోగిని ‘వర్క్ ఫ్రం హోం’ అడగ్గా, అందుకు సదరు కంపెనీ నిరాకరించింది. దీంతో ఆమె ప్రసవం ‘రిస్క్’గా మారింది. నెలలు నిండకుండా పుట్టిన ఆ బిడ్డ కొద్ది గంటల్లోనే చనిపోవటంతో.. బాధితురాలి కుటుంబం షాక్కు గురైంది. దీనిపై బాధితురాలు కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆమె పనిచేస్తున్న కంపెనీకి భారీ జరిమానా విధించింది.
బాధితురాలికి 22.5 మిలియన్ డాలర్ల (సుమారుగా రూ.200 కోట్లు) నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ తీర్పు చెప్పింది. అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో 2021లో ఈ ఘటన చోటుచేసుకోగా, కోర్టు ఈనెల 19న తీర్పు చెప్పింది. బాధితురాలు చెల్సియా వాల్స్కు వర్క్ ఫ్రం హోం ఇచ్చి వుంటే.. ఆమె ప్రసవం మరోలా ఉండేదని కోర్టు భావించింది.