US-China Tariff War | అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ దేశం చైనా మధ్య టారిఫ్ వార్ మరింత ముదిరింది. అమెరికా ఇటీవల ప్రతీకార సుంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సుంకాలపై చైనా ఘాటుగానే బదులిచ్చింది. డ్రాగన్ దేశం సైతం ప్రతీకార సుంకాలను ప్రకటించింది. అయితే, సుంకాలను వెనక్కి తీసుకోవాలని.. లేకపోతే మరింత సుంకాలను ప్రకటించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. చైనా వెనక్కి తగ్గకపోవడంతో ట్రంప్ అన్నంత పని చేశారు. చైనా వస్తువులపై భారీగా సుంకాలను ప్రకటించారు. తాజా సుంకాలతో 104శాతానికి సుంకాలు చేరాయి. కొత్తగా ప్రకటించిన సుంకాలు రాత్రి (అమెరికా స్థానిక కాలమానం) 12.01గంటల నుంచి అమలులోకి వస్తాయని వైట్హౌస్ వెల్లడించింది.
ఏప్రిల్ 2న అమెరికా చైనాపై 34శాతం సుంకాలను విధించింది. దీనికి స్పందనగా డ్రాగన్ దేశం సైతం అగ్రరాజ్యంపై 34శాతం సుంకాలు విధించింది. చైనా కొత్తగా ప్రకటించిన 34శాతం సుంకాలను ఉపసంహరించుకోకపోతే 50శాతం అదనంగా సుంకాలను ప్రకటిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఏప్రిల్ 9 నుంచి అమలులోకి వస్తాయని.. దాంతో పాటు చైనాతో అన్ని చర్చలు సైతం రద్దు చేస్తామని స్పష్టంచేశారు. దీనికి అమెరికా ప్రతీకార సుంకాలు ఏకపక్షమని.. రెచ్చగొట్టడమేనంటూ చైనా స్పందించింది. తాము సైతం ప్రతీకార సుంకాలను ప్రకటించామని.. భవిష్యత్లోనూ మరిన్ని సుంకాలు పెంచుతామని ఘాటుగా బదులిచ్చింది. సార్వభౌమాధికారం, భద్రతా, అభివృద్ధి తదితర ప్రయోజనాలు కాపాడుకునేందుకు ప్రతీకార చర్యలు తీసుకుంటామని చైనా వాణిజ్యమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 2న ట్రంప్ భారత్పై 26శాతం సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
వియత్నాంపై 46 శాతం, చైనాపై 34 శాతం, తైవాన్పై 32 శాతం, దక్షిణ కొరియాపై 25 శాతం, జపాన్పై 24 శాతం, యూరోపియన్ యూనియన్పై 20 శాతం సుంకాన్ని ప్రకటించారు. ఆయా దేశాలు అమెరికాపై చాలా ఎక్కువ సుంకాలను విధిస్తున్నాయని, వాటిపై ప్రతీకార సుంకాలను విధిస్తున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు. యూఎస్-చైనా టారిఫ్ వార్ మరింత ముదిరే అవకాశం ఉన్నది. అమెరికా విధించిన కొత్తగా ప్రకటించిన సుంకాలపై చైనా సైతం ఎంత మేర సుంకాలు విధిస్తుందో చూడాల్సిందే. టారిఫ్ వార్ మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టారిఫ్ వార్ కారణంగా ఇతర దేశాలపై సైతం భారీ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. తాజాగా సుంకాల ప్రకటనతో మార్కెట్లు ఎలా గట్టెక్కుతాయో వేచి చూడాల్సిందే.