బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ .. చైనాలో పర్యటిస్తున్నారు. బీజింగ్లో ఆయన ఆ దేశాధ్యక్షుడు జీ జిన్పింగ్తో భేటీ అయ్యారు. ఆ ఇద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నారు. చైనా అధ్యక్షుడు ఇచ్చిన విందులో ట్రంప్ పాల్గొన్నారు. ఆయనతో పాటు అమెరికా ప్రతినిధులు అందరూ ఆ బాంక్వెట్కు హాజరయ్యారు. తొలి రోజు మీటింగ్ తర్వాత ఇవాళ వైట్హౌజ్(White House) కీలక ప్రకటన జారీ చేసింది. ఇరాన్ అణు ఆయుధం కలిగి ఉండరాదని అమెరికా, చైనా సంయుక్తంగా అంగీకరించినట్లు శ్వేత సౌధం తన ప్రకటనలో వెల్లడించింది. ఇరు దేశాల నేతల మధ్య మీటింగ్ గొప్పగా జరిగినట్లు పేర్కొన్నది. అయితే హోర్ముజ్ జలసంధిలో సైనిక బలగాలను మోహరించడాన్ని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ వ్యతిరేకించారు. హోర్ముజ్ జలసంధి మార్గంలో ప్రయాణించే ఇంధన నౌకలకు టోల్ వసూల్ చేయడాన్ని కూడా చైనా తప్పుపట్టింది. అయితే హోర్ముజ్ ద్వారా సరఫరా అయ్యే ఇంధనంపై ఆధారపడడం తగ్గించుకోనున్నట్లు చైనా తెలిపింది. ఇక అమెరికా నుంచి ఎక్కువ మోతాదులో ఇంధనాన్ని కొనుగోలు చేయనున్నట్లు డ్రాగన్ దేశం చైనా పేర్కొనడం గమనార్హం.
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ను అమెరికాకు ఆహ్వానించారు ట్రంప్. జిన్పింగ్ సతీమణి పెంగ్ లియాన్కు కూడా ఆ ఇన్విటేషన్ అందజేశారు. సెప్టెంబర్ 24వ తేదీన వైట్హౌజ్కు రావాలని ట్రంప్ తన ఆహ్వానంలో కోరారు. బీజింగ్లో ఉన్న టెంపుల్ ఆఫ్ హెవెన్ను ట్రంప్ సందర్శించారు. ఇద్దరు దేశాధ్యక్షులు ఆ ఆలయం ముందు ఫోటోలు దిగారు. హాల్ ఆఫ్ ప్రేయర్ ఫర్ గుడ్ హార్వెస్ట్స్ ముందు ఫోటో దిగారు. ఆ ఆలయ సమూహం గురించి ట్రంప్కు జిన్పింగ్ వివరించారు. ప్రభుత్వ పండుగలను ఈ టెంపుల్లోనే నిర్వహించేవారని చెప్పారు. దేశ శ్రేయస్సు కోసం, సామాజిక సామరస్యం కోసం, మంచి పంటలు పండాలని చైనా పరిపాలకులు ఇక్కడ ప్రార్థనలు చేసేవారన్నారు.
రాజ్యానికి ప్రజలే ఫౌండేషన్ అని, అయితే ఆ బీజం బలంగా ఉంటేనే, రాజ్యం కూడా స్థిరంగా ఉంటుందని జిన్పింగ్ తెలిపారు. చైనీయుల నాగరికతకు చెందిన ఈ సిద్ధాంతాన్నే తమ కమ్యూనిస్టు పార్టీ అవలంబిస్తోందన్నారు. మనసుపూర్తిగా ప్రజా సేవకు తమ పార్టీ అంకితమైందని, దాని వల్ల తమకు చైనా ప్రజల మద్దతు లభిస్తోందన్నారు. సుమారు 600 ఏళ్లకు పురాతమైన టెంపుల్ ఆఫ్ హెవన్ పట్ల ట్రంప్ ఆసక్తి కనబరిచారు. చాలా ఇంప్రెసివ్గా ఉందన్నారు. అమెరికా, చైనా గొప్ప దేశాలు అని, రెండు దేశాల ప్రజలు గొప్పవారని ట్రంప్ పేర్కొన్నారు.