న్యూయార్క్, నవంబర్ 29: ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ను హత్య చేసేందుకు భారత ప్రభుత్వ ఉద్యోగి కుట్ర పన్నాడని, హత్య చేసేందుకు ఈ ఏడాది మేలో అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ అధికారితో లక్ష డాలర్లు ఒప్పందం కూడా కుదిరిందని న్యూయార్క్ కోర్టులో ఆరోపణలు నమోదయ్యాయి. ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ ఆరోపణల ఆధారంగా అమెరికా న్యాయ విభాగం భారత ప్రభుత్వ ఉద్యోగి నిఖిల్ గుప్తా (52)పై కేసు నమోదుచేసింది. ఈ నేరంలో దోషిగా తేలితే నిఖిల్ గుప్తాకు 10 ఏండ్ల జైలు శిక్ష విధిస్తామని న్యూయార్క్ జిల్లా యూఎస్ అటార్నీ మాథ్యూ జీ ఓల్సెన్ బుధవారం తెలిపారు. ఈ కేసులో నిందితుడు నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ అధికారులు 2023 జూన్ 30న అరెస్టు చేశారు.
అతడ్ని అమెరికాకు అప్పగించారా? లేదా? అన్నది తెలియరాలేదు. ఇదిలా ఉండగా, ఈ కేసు విచారణ నిమిత్తం ఇద్దరు అమెరికా నిఘా అధికారులు భారత్కు చేరుకున్నారు. దీంతో ఈ ఆరోపణల్లో నిజానిజాల్ని తేల్చేందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేస్తున్నట్టు భారత్ ప్రకటించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ, ‘అమెరికాతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఈ అంశంపై చర్చించాం. అన్ని కోణాల్లో పరిశీలించేందుకు నవంబర్ 18న ఉన్నతస్థాయి కమిటీని నియమించాం.
దీంట్లో తేలిన విషయాల ఆధారంగా భారత్ తదుపరి చర్యలు తీసుకుంటుంది’ అని చెప్పారు. భారత్ నిఘా ఏజెంట్లు పన్నూన్ హత్యకు కుట్ర పన్నారని, అయితే ఈ కుట్రను అమెరికా ఎన్ఐఏ అధికారులు భగ్నం చేశారని వారం రోజుల క్రితం ‘ఫైనాన్షియల్ టైమ్స్’ వార్తా కథనం వెలువరించింది. భారత్ ఈ విధమైన చర్యలకు దిగటంపై అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తం చేయటమేగాక, భారత్ను హెచ్చరిస్తూ.. వివరణ కోరారని ఆ వార్త కథనం పేర్కొన్నది.