న్యూఢిల్లీ, మార్చి 18 : ఇరాన్లోని ఖేష్మ్ ద్వీపంలో ఉన్న ఉప్పు నీటిని తాగునీరుగా మార్చే డీశాలినేషన్ ప్లాంట్పై మార్చి 7న అమెరికా జరిపిన దాడి పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చడానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. 30 గ్రామాలకు మంచినీరు సరఫరా చేసే ఆ ప్లాంట్పై అమెరికా చేసిన దాడితో ఇరాన్ ప్రతీకార దాడులను ఉధృతం చేసింది. ఖేష్మ్ ద్వీపంలోని మంచినీటి డీశాలినేషన్ ప్లాంట్పై దాడి చేసి అమెరికా తీవ్ర నేరానికి ఒడిగట్టిందని ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మండిపడ్డారు. కాగా, ఇరాన్ కూడా ఇదే నేరానికి పాల్పడిందని మరుసటి రోజు బహ్రెయిన్ విమర్శించింది. అయితే ఖేష్మ్ ద్వీపంపై జరిగిన దాడి కేవలం మంచినీటి సరఫరా సదుపాయానికే పరిమితం కాలేదు. యుద్ధానికి ముందు ప్రపంచ ముడి చమురు సరఫరాలో ఐదో వంతు సరఫరా జరిగిన హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన నేపథ్యంలో ఖేష్మ్ ప్రాముఖ్యత వెలుగులోకి వచ్చింది.
పర్షియన్ గల్ఫ్లో అతి పెద్ద ద్వీపమైన ఖేష్మ్ జనాభా దాదాపు 1.50 లక్షలు. యుద్ధానికి పూర్వం ఇదో స్వేచ్ఛా వాణిజ్య కేంద్రం. పర్యాటకుల పాలిట భూతల స్వర్గం. హొర్ముజ్ జలసంధి మీదుగా నౌకల రవాణాను ఇరాన్ నిలిపివేసిన తర్వాత ఈ ద్వీపం ప్రాముఖ్యత పెరిగింది. ఈ ద్వీపం విస్తీర్ణం, దాని స్థానం కారణంగా పర్షియన్ గల్ఫ్లోకి రాకపోకలు సాగించే నౌకలను ఇరాన్ ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తున్నది. ఈ యుద్ధంలో ఇరాన్ అనుసరిస్తున్న అసమాన యుద్ధ నమూనాకు ఈ ద్వీపం కేంద్రంగా ఉందని విశ్లేషకులు ధృవీకరిస్తున్నారు. ఈ నమూనా ప్రకారం చౌకగా తయారుచేసిన షాహెద్ డ్రోన్లతో అమెరికా, ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలపై దాడి చేసి వాటికంటే ఎంతో ఖరీదైన క్షిపణి నిరోధకాలను ఉపయోగించేలా ఇరాన్ ఒత్తిడి తీసుకువస్తున్నది.
ఇరాన్ సైన్యం గత వారం విడుదల చేసిన ఒక వీడియోలో క్షిపణి నగరంగా అభివర్ణించిన ఓ భారీ భూగర్భ సముదాయం కనిపించింది. అది పెద్ద సంఖ్యలో నావికా డ్రోన్లు, నౌకా విధ్వంసక క్షిపణులు, మందుపాతరలతో నిండిపోయి ఉంది. ఖేష్మ్ ద్వీపంలోని భూగర్భ క్షిపణి నగరాన్ని ధ్వంసం చేయడం ట్రంప్కు అంత సులభమైన వ్యవహారమేమీ కాదు. నావికా డ్రోన్లు, సముద్ర మైన్లు, క్షిపణుల ఆయుధాగారంతోపాటు హొర్ముజ్ గుండా వెళ్లే ఏ సైనిక లేదా వాణిజ్య కాన్వాయ్నైనా దెబ్బతీయడానికి తక్కువ ఖర్చుతో కూడిన షాహెద్ డ్రోన్లు ఇరాన్ బలం కాగా వీటిని ఎదుర్కోవడానికి అమెరికా, ఇజ్రాయెల్ ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తాయో వేచి చూడాల్సిందే.