టెహ్రాన్: ఇరాన్-అమెరికా యుద్ధం ముగిసిందని ప్రపంచం ఊపిరి తీసుకునేలోపే మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న హొర్ముజ్లో ఓ కార్గో షిప్ మీద ఇరాన్ డ్రోన్ దాడి చేసిన ఘటన రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలను పెంచేశాయి. ఈ లోపు ఇరాన్ ఓడరేవుపై శనివారం అమెరికా బలగాలు దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఒప్పంద పత్రంపై రెండు దేశాలు సంతకాలు చేసిన తర్వాత.. తుది చర్చలు జరగడానికి ముందు ఈ దాడులు కలకలం రేపుతున్నాయి.
అయితే అమెరికా దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. హొర్ముజ్ జల సంధి సమీపంలోని సిరిక్ నగరంలోని ఓడరేవు వద్ద ఓ క్షిపణి దాడి జరిగినట్టు ఇరాన్ వెల్లడించింది. అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సమీపంలోని బహ్రెయిన్పై డ్రోన్ దాడికి దిగింది. అనేక డ్రోన్లు తమ దేశంపై దాడి చేశాయని బెహ్రెయిన్ ప్రకటించింది. కాగా, ఇరాన్ డ్రోన్ దాడికి ప్రతిగానే తాము ఈ దాడులు చేసినట్టు యూఎస్ వైస్ ప్రెసిడెంట్ వాన్స్ చెప్పారు. దాడులు ప్రతిదాడులను ప్రోత్సహిస్తాయన్నారు.
ఇంకోవైపు లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం పూర్తిగా అమల్లోకి రాకముందే దక్షిణ లెబనాన్లోని నబాటియే ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడులు జరిపింది. దీంతో ఒప్పందాన్ని ఈ దాడులు ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని లెబెనాన్ అధికారులు అంటున్నారు. రెండు దేశాల సరిహద్దు వెంబడి పదే పదే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురవుతోంది. ఈ దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తూ ఒప్పంద ఉల్లంఘనను వ్యతిరేకించింది.