న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ( UNSC membership )లో భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందేనంటూ ఉజ్బెకిస్థాన్ మరోసారి తన మద్దతు ప్రకటించింది. ‘ఐక్యరాజ్యసమితిలోని పెద్ద దేశాల్లో భారత్ ఒకటి. ఆగ్నేయ ఆసియా దేశాల్లో భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నది. కాబట్టి భారత్కు ఐక్యరాజ్యసమితిలో పర్మినెంట్ మెంబర్షిప్ ఇవ్వడం చాలా ముఖ్యం’ అని భారత్లో ఉజ్బెకిస్థాన్ రాయబారి దిల్సోద్ అఖటోవ్ పేర్కొన్నారు. భారత్ ఇవాళ రోటేషన్ పద్ధతిలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అధ్యక్షత బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అఖటోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత శాశ్వత సభ్యత్వ హోదాకు తాము ఎప్పటినుంచో మద్దతు తెలుపుతున్నామని, ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వ హోదా లేని దేశాలకు కూడా తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అఖటోవ్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధికి భారత్ కృషి చేస్తున్నదని, ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో కూడా భారత్ కీలకపాత్ర పోషిస్తున్నదని ఉజ్బెకిస్థాన్ రాయబారి అఖటోవ్ వ్యాఖ్యానించారు.