శ్రీలంక తదుపరి ప్రధానిగా యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్పీ) నేత రనీల్ విక్రమసింఘే బాధ్యతలు చేపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. యూఎన్పీ పార్టీ ఇప్పటికే ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. గురువారం నాడే విక్రమ సింఘే ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
విక్రమ సింఘేనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలని పార్టీలో తుది నిర్ణయం దాదాపుగా జరిగిపోయిందని, చివరి సారిగా ఇదే విషయంపై పార్టీలో అంతర్గతంగా కీలక చర్చలు సాగుతున్నాయని శ్రీలంక మీడియా పేర్కొంది. మాజీ ప్రధాని మహీంద రాజపక్సే పార్టీ కూడా విక్రమ సింఘేకే పూర్తి మద్దతిచ్చింది. ఇక.. పార్లమెంట్లో కూడా ఆయనకు మెజారిటీ అన్న ఇబ్బందులు ఉండవని శ్రీలంక మీడియా పేర్కొంది.
ప్రజాందోళనలు మిన్నంటిన నేపథ్యంలో ప్రధాని పదవికి మహీంద రాజపక్సే రాజీనామా చేసేశారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి రాజపక్సే విధానాలు, ఆయన కుటుంబీకులే కారణమంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వెంటనే ప్రధాని పదవికి రాజపక్సే, రాష్ట్రపతి పదవికి గొటబాయా కూడా రాజీనామాలు చేయాలని ప్రజలు డిమాండ్లు చేస్తున్నారు.
ఇక మాజీ ప్రధాని మహీంద రాజపక్సేకు శ్రీలంక కోర్టు ఝలక్ ఇచ్చింది. ఆయన విదేశాలకు వెళ్లొద్దని ఆంక్షలు విధించింది. మహీందతో పాటు ఆయన కుమారుడు, ఎంపీ నమల్ రాజపక్సతో పాటు మరో 15 మంది కూడా విదేశాలకు వెళ్లొద్దని కోర్టు ఆంక్షలు విధించింది.