వాషింగ్టన్ : భారత్లో మైనారిటీల హక్కులు క్షీణిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. వ్యూహం ప్రకారం పెద్దయెత్తున, ప్రమాదకర స్థాయిలో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధి ఫెర్నాండ్ డీ వరెనెస్ ఆరోపించారు. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ విచారణలో వెలుగుచూసిన అంశాల నివేదికను వరెనెస్ ఈనెల 20న సమర్పించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తన విధానాలను మార్చుకునే విధంగా అంతర్జాతీయ ఒత్తిడి అవసరమని ఆయన నొక్కి చెప్పారు. వాషింగ్టన్ డీసీలో వరెనెస్ మాట్లాడుతూ భారత్లో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులపై అరాచకాలు జరుగుతున్నాయని తెలిపారు. మణిపూర్ హింసాత్మక సంఘటనలను వరెనెస్ చాలాసార్లు ప్రస్తావించారు. ముస్లింలను, ఇతర మైనారిటీలను బలి పశువులుగా చేస్తుండటానికి మణిపూర్ సంఘటనలు ఉదాహరణ అని చెప్పారు. 2024లో లోక్సభ ఎన్నికలు జరగబోతుండటంతో మైనారిటీలు, మానవ హక్కుల మద్దతుదారులపై దాడులు మరింత పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతున్నదని పేర్కొన్నారు. దాడులకు పాల్పడినవారిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.