కీవ్, సెప్టెంబర్ 26: యుద్ధం చేయడానికి నిరాకరిస్తున్న, స్వచ్ఛందంగా శత్రువుకు లొంగిపోతున్న సైనికులకు పదేండ్ల జైలుశిక్ష విధించాలని రష్యా ప్రభుత్వం నిర్ణయించింది. ఉక్రెయిన్తో గత ఏడు నెలలుగా జరుగుతున్న యుద్ధంలో రష్యా ఇటీవల కొన్ని ఎదురుదెబ్బలు తింటున్నది. కీవ్లో ఇటీవల ఉక్రెయిన్ సైన్యం రష్యాపై ఎదురుదాడికి దిగి కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో రష్యా తమ ప్రధాన వ్యూహకర్తను కూడా మార్చేసింది. రష్యా తీసుకున్న ఈ నిర్ణయాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మండిపడ్డారు. ఆయన నేరుగా రష్యా పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీ అధ్యక్షుడు పౌరులను చావడానికి పంపుతున్నారు అని పేర్కొన్నారు. రష్యన్ భాషలో మాట్లాడిన జెలెన్స్కీ లొంగిపోయిన రష్యా సైనికులను సాధారణ పౌరుల్లాగానే చూసుకుంటామని, వారు ఏ పరిస్థితుల్లో లొంగిపోయారో ఎవరికీ తెలియనివ్వబోమని హామీ ఇచ్చారు. మరోవైపు ఉక్రెయిన్లోని తూర్పు, దక్షిణ ప్రాంతాలను రష్యాలో కలుపుకొనేందుకు వరుసగా రెండోరోజు నిర్వహించిన ఓటింగ్లో మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని జెలెన్స్కీ విమర్శించారు.
ఎడ్వర్డ్ స్నోడెన్కు రష్యా పౌరసత్వం
అమెరికా మాజీ సెక్యూరిటీ కాంట్రాక్టర్, విజిల్బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ రష్యన్ పౌరసత్వం మంజూరు చేశారు. స్నోడెన్ సహా 75 మంది విదేశీయులకు రష్యా పౌరసత్వం కల్పించారు. 2013లో అమెరికా రహస్య నిఘా ఆపరేషన్ల వివరాలను ప్రపంచానికి వెల్లడించి స్నోడెన్ సంచలనం సృష్టించాడు. ఈ కేసు విచారణ నుంచి తప్పించుకొనేందుకు స్నోడెన్ రష్యాలో ఆశ్రయం పొందుతున్నాడు.