UNSC – Gaza | ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్లు హమస్ మధ్య తక్షణం కాల్పుల విరమణ అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతామండలి (యూఎన్ఎస్సీ) డిమాండ్ చేసింది. బందీలందరినీ భేషరతుగా విడుదల చేయాలని కూడా డిమాండ్ చేసింది. ఈ సమావేశానికి శాశ్వత సభ్యదేశం అమెరికా గైర్హాజరైంది. యూఎన్ఎస్సీలో 14 మంది సభ్యులు హాజరు కాగా, 10 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ‘పాలస్తీనియన్లు తీవ్రంగా బాధ పడుతున్నారు. ఈ రక్తపాతం సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరింత జాప్యం కాకుండా రక్తపాతానికి ముగింపు పలుకడమే మన బాధ్యత` అని భద్రతా మండలి సమావేశం తర్వాత ఐరాసలో అల్జీరియా రాయబారి అమర్ బెండ్ జామా చెప్పారు.
ఇదిలా ఉంటే, ఐరాస భద్రతామండలి తీర్మానంపై అమెరికా తన వీటో అధికారాన్ని వినియోగించుకోకుంటే, వాషింగ్టన్కు ప్రతినిధుల టీంను రద్దు చేస్తామని ఇజ్రాయెల్ ఆర్మీ రేడియో ప్రకటించింది. గాజాలో దాదాపు ఆరు నెలలుగా కొనసాగుతున్న యుద్ధ విరమణకు అమెరికా వ్యతిరేకంగా ఉంది. అక్టోబర్ ఏడో తేదీ దాడి సాకుతో ఇజ్రాయెల్ తన మిత్రపక్షం అమెరికా దన్నుతో పాలస్తీనియన్లపై ప్రతీకార దాడులు చేస్తున్నది. అక్టోబర్ ఏడో తేదీన జరిగిన దాడిలో 1200 మంది మరణించారని ఇజ్రాయెల్ తెలిపింది.
హమస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో 32 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించడంతో కాల్పుల విరమణకు ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతున్నది. రంజాన్ సందర్భంగా కాల్పుల విరమణ చేయాలని యూఎన్ఎస్సీ తీర్మానించడానికి వీలుగా సమావేశానికి అమెరికా గైర్హాజరైంది. అలాగే బందీలందరినీ బేషరతుగా విడుదల చేయాలని కూడా యూఎన్ఎస్సీ డిమాండ్ చేసింది. అక్టోబర్ ఏడో తేదీ దాడి సందర్భంగా హమాస్ 253 మంది వద్ద బందీలు ఉన్నారని ఇజ్రాయెల్ తెలిపింది.