వాషింగ్టన్: పాలస్తీనా ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించడంతోపాటు అక్కడ స్థిరపడటాన్ని ఖండిస్తూ యునైటెడ్ నేషన్స్ (యూఎన్)లో చేసిన తీర్మానానికి భారత్ మద్దతు తెలిపింది. (India Supports UN Resolution) ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది. ‘తూర్పు జెరూసలేంతో సహా ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో, ఆక్రమిత సిరియన్ గోలన్లో’ ఇజ్రాయెల్ సెటిల్మెంట్ కార్యకలాపాలను ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో గురువారం ఒక తీర్మానాన్ని ఆమోదించారు. అమెరికా, కెనడా సహా ఏడు దేశాలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాయి. పద్దెనిమిది దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి.
కాగా, అక్టోబరు 7న ఇజ్రాయెల్పై హమాస్ అనూహ్య దాడుల్లో 1,200 మంది ఇజ్రాయిలీలు మరణించగా, 200 మందికి పైగా బందీలుగా ఉన్నారు. దీనికి ప్రతీకారంగా పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేసింది. ఈ బాంబు దాడుల వల్ల గాజాలో 11,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. లక్షలాది మంది గాజా ప్రజలు తమ నివాస ప్రాంతాలను వీడి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు.