న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: భారత్కు ఎలాన్ మస్క్ షాకిచ్చారు. చైనాలో ఆకస్మికంగా పర్యటించి ఆ దేశ ప్రధాన మంత్రి లీ కియాంగ్తో సమావేశమై వ్యాపార, పారిశ్రామిక, పెట్టుబడి అంశాలపై చర్చించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నది. ఇండియా టూర్ను రద్దు చేసుకున్న మస్క్.. హఠాత్తుగా చైనాలో తేలారు మరి. భారత్లో వారం, 10 రోజుల కిందటే మస్క్ పర్యటించాల్సి ఉందన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడికి రానన్న ఈ టెస్లా అధినేత.. ఆదివారం ఆగమేఘాల మీద పొరుగు దేశానికి వెళ్లారు. దీంతో దేశ, విదేశీ మీడియాల్లో ‘హలో చైనా.. గుడ్బై ఇండియా’ అన్న వార్తలు వస్తుండటం గమనార్హం.
భారత్లో టెస్లా పెట్టుబడుల కోసం.. మోదీ సర్కారు నిబంధనలు, విధానాల్ని మార్చి పన్ను రాయితీలు కల్పించినా ఆశించిన ఫలితం మాత్రం రావడం లేదు. నిజానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై, ఇక్కడ రూ.25,000 కోట్ల పెట్టుబడితో ఓ విద్యుత్తు ఆధారిత (ఈవీ) వాహనాల తయారీ ప్లాంట్ను మస్క్ ప్రకటించబోతున్నారన్నది వినిపించింది. కానీ అనూహ్యంగా మస్క్.. భారత్ పర్యటన రైద్దెంది. మరోవైపు చైనాలో పర్యటించారు. దీంతో భారత్లో టెస్లా పెట్టుబడుల సంగతి ఇక అంతేనా?.. చైనాకు వెళ్లినట్టేనా?.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మస్క్ ఇచ్చిన ట్విస్ట్.. ఎన్నికల వేళ కేంద్రంలోని మోదీ సర్కారుకు మింగుడు పడకుండా ఉన్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయిప్పుడు. టెస్లా పెట్టుబడులను.. ఎన్నికల ప్రచారంలో మోదీ స్నేహశీల వ్యాపార విధానానికి నిదర్శనంగా బీజేపీ వర్గాలు వాడుకోవాలని చూశాయంటున్నారు. కానీ మస్క్ చైనా పర్యటనతో సీన్ రివర్సైంది. ప్రతిపక్షాలు సైతం మోదీ సర్కారు వైఫల్యం వల్లే ఇదంతా అని విమర్శిస్తున్నాయి. ‘మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలపై విశ్వాసం లేకనే భారత్కు రావాల్సిన విదేశీ కంపెనీలు చైనాకు తరలిపోతున్నాయి. టెస్లా అంశమే ఇందుకు తాజా ఉదాహరణ’ అని ఎక్స్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షమా మహ్మద్ దుయ్యబట్టారు. యూట్యూబ్ చానళ్లలో కూడా ‘భారత్కు రావడానికి సమయం లేని మస్క్.. చైనాకు వెళ్లారు ఎందుకో’ అన్న రీతిలో కథనాలు మొదలయ్యాయి.