లండన్: బ్రిటన్కు చెందిన ప్రిన్స్ చార్లెస్కు రెండోసారి కరోనా సోకింది. కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ఆయన కార్యాలయం గురువారం తెలిపింది. ప్రస్తుతం ఆయన స్వీయ ఐసొలేషన్లో ఉన్నట్లు ట్వీట్ చేసింది. తల్లి క్వీన్ ఎలిజబెత్ 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వించెస్టర్లో జరుగాల్సిన ఒక కార్యక్రమానికి 73 ఏండ్ల ప్రిన్స్ చార్లెస్ హాజరు కావాల్సి ఉంది. అయితే కరోనా బారిన పడటంతో ఈ కార్యక్రమానికి హాజరు కాలేనందుకు ఆయన చాలా నిరాశ చెందారని ప్రిన్స్ చార్లెస్ కార్యాలయం క్లారెన్స్ హౌస్ తెలిపింది.
కాగా, బుధవారం బ్రిటీష్ ఆసియా ట్రస్ట్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రిన్స్ చార్లెస్ పాల్గొన్నారు. బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి, అంతర్గత మంత్రి ప్రీతి పటేల్, ఇతర అతిథులతో ఆయన మాట్లాడిన ఫొటోలు మీడియాలో వచ్చాయి. అనంతరం ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
అయితే 2020 మార్చిలో ప్రిన్స్ చార్లెస్కు తొలిసారి కరోనా సోకింది. తేలికపాటి లక్షణాలే ఉండటంతో తాను అదృష్టవంతుడినని ఆయన చెప్పారు. అనంతరం కొన్ని రోజులకు కుమారుడు ప్రిన్స్ విలియమ్స్కు కూడా కరోనా సోకింది.
మరోవైపు ప్రిన్స్ చార్లెస్ భార్య కెమిల్లాకు తాజాగా కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్గా తేలింది. దీంతో గురువారం జరిగిన క్వీన్ ఎలిజబెత్ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారని ఆ దేశ అధికారులు తెలిపారు. ప్రిన్స్ చార్లెస్తోపాటు భార్య కెమిల్లా కూడా ఇటీవల టీకా బూస్టర్ డోసు తీసుకున్నారని వెల్లడించారు.