కీవ్, మే 27: డాన్బాస్ రీజియన్లో రష్యా దురాక్రమణను సమర్థంగా తిప్పికొట్టేందుకు మల్టిపుల్ లాంచ్ రాకెట్ వ్యవస్థ(ఎంఎల్ఆర్ఎస్)లను పంపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పశ్చిమదేశాలను కోరారు. గురువారం రాత్రి ఆయన జాతినుద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని ఆయుధాలతో పోరాడుతున్నామని, ఆక్రమణదారులను తరిమికొట్టేందుకు మరింత వేగంగా, విశ్వాసంతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నామని, ఇందుకు అత్యాధునిక ఆయుధాలు పంపి సహకరించాలని అన్నారు.
రష్యా బలగాలు ఉక్రెయిన్ తూర్పు పట్టణాలను నాశనం చేస్తున్నాయని, మరియుపోల్, వోల్నోవాఖా పట్టణాల మాదిరిగా పొపస్నా, బక్ముత్, లైమాన్, లైసిచాన్స్, తదితర ప్రాంతాలను కూడా బూడిద చేయాలని అనుకుంటున్నాయని అన్నారు. యుద్ధ నేరాల కింద మరో ఇద్దరు రష్యా సైనికులపై ఉక్రెయిన్ విచారణ చేస్తున్నది. ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్ గురువారం ఉక్రెయిన్లో పర్యటించారు. జెలెన్స్కీతో భేటీ అయ్యారు.
లుహాన్స్ రీజియన్లోని సీవీరోడోనెట్స్ పట్టణంలో రష్యా బలగాలు విధ్వంసం సృష్టించాయని మేయర్ ఒలెక్సాండర్ స్ట్రియుక్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు దాదాపు 1500 మంది పౌరులు చనిపోయారని, 60 శాతం నివాస భవనాలు ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తూర్పు డొనెట్స్ రీజియన్లోని వ్యూహాత్మక పట్టనం లిమాన్ను స్వాధీనం చేసుకున్నట్టు రష్యా మద్దతు గల వేర్పాటువాద బలగాలు శుక్రవారం ప్రకటించాయి. జెలెన్స్కీ సలహాదారు ఒలెక్సీ కూడా ధ్రువీకరించారు.
రష్యాను ప్రపంచం ముందు ఏకాకి చేసేందుకు పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు విఫలమౌతాయని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అన్నారు. అటువంటి ప్రయత్నాలు చేసే వారే దెబ్బతింటారని, పెరుగుతున్న ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. యురేషియన్ ఎకనమిక్ ఫోరమ్ను ఉద్దేశించి గురువారం వీడియో లింక్లో మాట్లాడుతూ పశ్చిమ దేశాలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆహార సమస్య, తదితర సమస్యలు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.