Ukraine invasion | ఉక్రెయిన్పై దండయాత్రకు దిగిన రష్యాతో స్నేహ సంబంధాలకు జర్మనీ కటీఫ్ చెప్పింది. రష్యా నుంచి తమ దేశానికి గ్యాస్ సరఫరాకు చేపట్టిన నార్డ్ స్ట్రీమ్-2 గ్యాస్ పైప్లైన్ సర్టిఫికేషన్ ప్రాసెస్ను నిలిపివేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఉక్రెయిన్పై సైనిక చర్యకు దిగిన రష్యాపై ఒత్తిడి పెంచేందుకు పశ్చిమ దేశాలు ఆంక్షలు అమల్లోకి తెచ్చాయని జర్మనీ చాన్స్లర్ ఒలాఫ్ స్కూల్జ్ ప్రకటించారు. జర్మనీ తీసుకున్న నిర్ణయాన్ని మాస్కో తప్పుబట్టింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలోని రెండు వేర్పాటువాద ప్రాంతాలు ప్రకటించుకున్న స్వాతంత్య్రాన్ని గుర్తించారు. దీనికి ప్రతిగా నార్డ్ స్ట్రీమ్-2 గ్యాస్ పైపులైన్ ప్రాజెక్టు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఒలాఫ్ స్కూల్జ్ తెలిపారు. అంతర్జాతీయ చట్టాలను రష్యా తీవ్రంగా ఉల్లంఘించిందని ఆరపించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తీసుకున్న ఏకపక్ష చర్యపై అంతర్జాతీయ సమాజం స్పందించాల్సి ఉందని బెర్లిన్లో మీడియాతో చెప్పారు.
అమెరికా, కొన్ని యూరప్ దేశాలు ఒత్తిడి తీసుకొస్తున్నా, నార్డ్ స్ట్రీమ్-2 గ్యాస్ పైపులైన్ ప్రాజెక్టు నిర్మాణాన్ని సుదీర్ఘకాలంగా సమర్థిస్తూ వచ్చింది జర్మనీ. రష్యా-జర్మనీ మధ్య మరో మార్గంలో నాచురల్ గ్యాస్ పైపులైన్ నిర్మాణం చేపట్టవచ్చునని అమెరికా వాదిస్తూ వచ్చింది. నార్డ్ స్ట్రీం2 ప్రాజెక్టు ద్వారా ఉక్రెయిన్, పోలండ్లకు ముప్పు పొంచి ఉందని వాదిస్తున్నది. ఈ రెండు దేశాలకు గ్యాస్ పంపిణీ చేయకుండా రష్యా చర్య తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నది.
గత జర్మనీ చాన్స్లర్ ఎంజిలా మెర్కెల్.. రష్యా-జర్మనీ మధ్య చేపట్టిన నార్డ్ స్ట్రీం-2 పైపులైన్ ప్రాజెక్టును సమర్థించింది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని ఒలాఫ్ స్కూల్జ్ పేర్కొన్నారు. జర్మనీ భద్రతకు ముప్పుగా పరిణమించిన నార్డ్ స్ట్రీం గ్యాస్ పైపులైన్ ప్రాజెక్టు నుంచి విత్డ్రా కావాలని నిర్ణయించామన్నారు.