యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన ఉక్రెయిన్.. ఆ దేశంపై యుద్ధం చేస్తున్న రష్యా దేశాల విదేశాంగ శాఖ మంత్రులు త్వరలోనే తమ దేశంలో భేటీ అవుతారని టర్కీ వెల్లడించింది. ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు నిర్వహించి, మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే చాలాసార్లు టర్కీ ప్రకటించింది.
ఈ నేపథ్యంలోనే టర్కీ అధ్యక్షుడు రీసెప్ టాయిప్ ఎర్డోగన్.. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో సంభాషించారు. ఇరు దేశాలు శాంతి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే శాంతి చర్చలు జరిపేందుకు రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గే లావరోవ్, ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి డిమిట్రో కులేబా అంగీకరించినట్లు టర్కీ ప్రభుత్వం తెలిపింది.
‘‘ప్రెసిడెంట్ ఎర్డోగాన్ స్వయంగా కల్పించుకోవడం, అలాగే మన డిప్లొమాటిక్ కృషికి ఫలితం దక్కింది. రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రులు నాతో కలిసి అంటాల్యలో చర్చలు జరిపేందుకు అంగీకరించారు’’ అని టర్కీ విదేశాంగ మంత్రి కావుసోగ్లు ట్వీట్ చేశారు. ఈ అడుగు శాంతి వైపు పడుతుందని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. ఈ మూడు దేశాల విదేశాంగ మంత్రులు గురువారం నాడు టర్కీలోని అంటాల్యలో కలిసి త్రైపాక్షిక చర్చలు జరపనున్నారు.
Upon President @RTErdogan’s initiatives & our intensive diplomatic efforts, Foreign Ministers Sergei Lavrov of #Russia & Dmytro Kuleba of #Ukraine have decided to meet with my participation on the margins of @AntalyaDF.
Hope this step will lead to peace and stability.
— Mevlüt Çavuşoğlu (@MevlutCavusoglu) March 7, 2022