కీవ్ : ఉక్రెయిన్పై రష్యా దాడుల్లో ఇప్పటివరకూ 165 మంది చిన్నారులు మరణించారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్పై రష్యా దమనకాండ మంగళవారం 41వ రోజుకు చేరింది. మరోవైపు బుచా సహా పలు నగరాల్లో రష్యా దళాలు పౌరులను చంపడం, ఇతర యుద్ధ నేరాలపై తాను ఐక్యరాజ్యసమితి భద్రతా సమితి దృష్టికి తీసుకువెళతానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు.
పౌరులను తమ దళాలు టార్గెట్ చేయలేదని వెల్లడించే ఆధారాలను ఐక్యరాజ్యసమితి భద్రతా సమితి భేటీ ముందుంచుతామని రష్యా జెలెన్స్కీ ఆరోపణలను తోసిపుచ్చగా ఉక్రెయిన్లో పౌరుల హత్యను నిరసిస్తూ మాస్కోపై తాజా ఆంక్షలు విధించేందుకు అమెరికా, యూరప్ సన్నద్ధమయ్యాయి.
ఇక ఉక్రెయిన్పై రష్యా దాడిని ప్రతిఘటిస్తూ ఇప్పటివరకూ 18,500 మంది రష్యా సైనిక సిబ్బందిని మట్టుబెట్టామని, 676 ట్యాంకులను ధ్వంసం చేశామని ఉక్రెయిన్ సాయుధ బలగాలు వెల్లడించాయి. రష్యా-ఉక్రెయిన్ వార్ నేపధ్యంలో ఏప్రిల్ 4 నాటికి 42 లక్షల మంది ఉక్రెయిన్ను వీడారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. యుద్ధం ముగిశాక తిరిగి ఉక్రెయిన్కు చేరుకుంటామని 79 శాతం మంది శరణార్ధులు పేర్కొనడం గమనార్హం.