మాస్కో: తమ దేశ రాజధాని మాస్కోపై మూడేండ్ల కాలంలో ఉక్రెయిన్ అతి పెద్ద డ్రోన్ దాడికి పాల్పడిందని రష్యన్ ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ టస్ తెలిపింది. ఈ దాడిలో కీలక చమురు శుద్ధి కేంద్రం దెబ్బతిందని.. నగరంలో పలుచోట్ల మంటలు చెలరేగాయని పేర్కొన్నది. చమురు శుద్ధి కేంద్రం నుంచి కొన్ని మీటర్ల ఎత్తు వరకు మంటలు, పొగలు వెలువడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. తమ దేశ వైమానిక దళం 194 డ్రోన్లను కూల్చివేసిందని మాస్కో మేయర్ సెర్గీ సొబ్యనిన్ తెలిపారు.
దాడి కారణంగా మాస్కోలోని పెద్ద విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను నిలిపేశారు. ఉక్రెయిన్ సుమారు 1000 డ్రోన్లతో, 4 క్రూయిజ్ మిసైళ్లతో రాత్రివేళ రష్యా వ్యాప్తంగా దాడికి పాల్పడింది. దౌత్య ఒప్పందం కోసం ఒత్తిడి తీసుకు రావడానికే ఈ దాడి చేసినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ‘మా దేశం తగలబడితే, మీ మాస్కో కూడా తగలబడుతుంది’ అని ఆయన రష్యాను హెచ్చరించారు. తమ దాడికి స్పందనగా రష్యా ఏడు క్షిపణులను, 239 డ్రోన్లను తమ దేశంపై ప్రయోగించిందని ఉక్రెయిన్ తెలిపింది. కీవ్, పొల్టావా ప్రాంతాల్లోని చమురు కేంద్రాలపై దాడి చేసినట్టు రష్యా రక్షణ శాఖ ధ్రువీకరించింది.