ఇస్తాంబుల్: ఉక్రెయిన్, రష్యా మధ్య కీలక ఒప్పందం జరిగింది. నల్ల సముద్రం మీదుగా ఆహార ధాన్యాల సరఫరా అంశంపై రెండు దేశాలు ముఖ్యమైన ఒప్పందం కుదుర్చుకున్నాయి. శుక్రవారం ఆ అంశంపై రెండు దేశాలు సంతకం చేసుకున్నాయి. ఈ ఒప్పందం వల్ల నల్ల సముద్రం ద్వారా ఉక్రెయిన్ తన ఆహారధాన్యాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయనున్నది. అగ్రిమెంట్ వల్ల మిలియన్ల టన్నుల గోధుమలను సరఫరా చేయనున్నారు. యుద్ధం వల్ల ఉక్రెయిన్లో మిలియన్ల టన్నుల గోధుమ నిలిచిపోయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడింది. పేద దేశాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి రెండు దేశాలు నేరుగా ఒప్పందంపై సంతకం చేయలేదు. ఇస్తాంబుల్లో జరిగిన కార్యక్రమంలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగూ, ఉక్రెయిన్ మంత్రి ఒలెగ్జాండర్ కుబ్రకోవ్లు వేర్వేరుగా ఒప్పందంపై సంతకం చేశారు. ఐక్యరాజ్యసమితి, టర్కీ, రష్యా, ఉక్రెయిన్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చాలా వరకు ప్రపంచదేశాలకు ఉక్రెయిన్ నుంచే గోధుమ ఎగుమతి అవుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ గోధుమల సరఫరా నిలిచిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆహార సంక్షోభం ఏర్పడింది. గోధుమతో తయారయ్యే బ్రెడ్, పాస్తా ధరలు పెరిగాయి. వంట నూనెలు, ఫెర్టిలైజర్ల ధరలు కూడా పెరగడం వల్ల చాలా దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాజా ఒప్పందం ప్రకారం ఆహార ధాన్యాలను రవాణా చేస్తున్న షిప్లను రష్యా టార్గెట్ చేయదు. మైనింగ్ ఉన్న నీటిలో కార్గో షిప్లకు ఉక్రెయిన్ నౌకలు రక్షణ ఇవ్వనున్నాయి. అన్ని నౌకలను టర్కీ తనిఖీ చేయనున్నది. రష్యాకు చెందిన గోధుమ, ఫెర్టిలైజర్లను కూడా నల్ల సముద్రం ద్వారా ఎగుమతి చేయనున్నారు. నల్ల సముద్రంపై ఆశాకిరణం వెలిసినట్లు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు.