విదేశాల నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులకు యూకే గుడ్ న్యూస్ చెప్పింది. తమ దేశానికి వచ్చే వ్యక్తులు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటే వారికి కరోనా టెస్టులు చేయకూడదని ఈ దేశం భావిస్తోందట. ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించాడు.
వ్యాక్సిన్ తీసుకున్న అంతర్జాతీయ ప్రయాణికులను కరోనా పరీక్షల నుంచి మినహాయించే ఆలోచనలో తాము ఉన్నట్లు జాన్సన్ ప్రకటించారు. అలాగే రోజువారి ఒమిక్రాన్ కేసుల డేటా కూడా అదుపులోకి వస్తోందని చెప్పారు.
ఈ క్రమంలోనే అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటకులకు తమ దేశం తలుపులు తెరిచే ఉన్నాయని చెప్పేందుకే కరోనా టెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని అనుకుంటున్నట్లు జాన్సన్ వివరించారు. కాగా, ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల వల్ల తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో యూకే ఒకటి. ఇక్కడ లక్షల్లో డెల్టా, వేలల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.