లండన్ : ఉక్రెయిన్పై రష్యా దమనకాండ కొనసాగుతుండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్పై అమెరికా సహా పలు దేశాలు భగ్గుమంటున్నాయి. పుతిన్ను యుద్ధ నేరస్తుడిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అభివర్ణించారు. పౌర స్ధావరాలపై రష్యా బాంబులు కురిపిస్తున్న క్రమంలో పుతిన్పై ఆయన మండిపడ్డారు. ఉక్రెయిన్పై దాడిని ఆపాలని చర్చలు పునరుద్ధరించాలని పాశ్చాత్య దేశాలు డిమాండ్ చేస్తుండగా రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రధాన నగరాల్లో రష్యన్ సేనలు కాల్పులతో విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్ధులను సురక్షితంగా తరలించేందుకు సహకరించేందుకు రష్యా అంగీకరించింది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని పుతిన్ను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.
భారత విద్యార్ధులు ఖార్కివ్ను వీడి వెళ్లేందుకు యుద్ధానికి ఆరు గంటల విరామం ప్రకటించామని రష్యా పేర్కొంది. కాగా ఖర్కీవ్లో రష్యన్ కాల్పులను యుద్ధ నేరంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమర్ జెలెన్స్కీ అభివర్ణించారు. ఇక ఉక్రెయిన్కు అమెరికా అండగా నిలుస్తుందని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ పునరుద్ఘాటించారు. అయితే తాము నేరుగా రష్యా సేనలతో తలపడబోమని చెప్పారు. తమ మిత్రపక్షాలతో కలిసి నాటో పరిధిలోని ప్రాంతాలను అమెరికా కాపాడుకుంటుందని స్పష్టం చేశారు.
ఇక మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తే అది అణ్వాయుధాలతోనే సాగుతుందని ఈ యుద్ధంతో పెను విధ్వంసం తప్పదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ అణ్వాయుధాలను సమీకరించేందుకు రష్యా అనుమతించదని అన్నారు. ఆంక్షలకు రష్యా సిద్ధంగా ఉందని అయితే తమ అథ్లెట్లు, జర్నలిస్టులు, సాంస్క్రతిక ప్రతినిధులను పాశ్చాత్య దేశాలు టార్గెట్ చేస్తాయని ఊహించలేదని లావ్రోవ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడులు బుధవారం ఏడో రోజు కొనసాగాయి.