UK Parliament | బిడ్డలున్న తల్లులు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకూడదన్న నిబంధనను పునః సమీక్షించాలని యూకే పార్లమెంట్ నిర్ణయించుకుంది.ఈ నిబంధనను సడలించే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పార్లమెంట్ అధికారులకు స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.
లేబర్ పార్టీకి చెందిన స్టెల్లా క్రేజీ అనే ఎంపీ తన చంటిబిడ్డతో సహా పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. దీనిని గమనించిన పార్లమెంట్ సిబ్బంది, ఇలా సమావేశాలకు హాజరుకావడం పార్లమెంట్ నిబంధనలకు విరుద్ధమని మందలించారు. మీరు చంటిపిల్లతో సమావేశాలకు హాజరుకావడం ఇకపై కుదరదు అని ఒకింత హెచ్చరించారు. దీంతో ఆమె ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా ఓ ఎంపీని హెచ్చరించడంపై సహచర ఎంపీలు కూడా సదురు అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్పీకర్ సర్ లిండ్సే కూడా స్పందించారు. తల్లిపాత్రలో ఉన్న ఎంపీలు కూడా పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడం చాలా ముఖ్యమని, చట్టాలు చేయడంలో వారి పాత్ర కూడా ఉండాలని, అందుకు తగ్గ నియమ నిబంధనలు, ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా సరిపోయే నిబంధనలు చేయాలని అధికారులను కోరారు. పైగా పార్లమెంట్ ఆవరణలో నర్సరీ కూడా ఉందని, దీనిని గమనంలోకి తీసుకుంటూ, నియమ నిబంధనలను రూపొందించాలని ఆదేశించారు.
అయితే సమావేశాలు సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత కూడా తమపై ఉందని, అందుకు తగ్గ వాతావరణాన్ని కూడా కల్పించాల్సిన బాధ్యత స్పీకర్ స్థానానికి ఉందని సర్ లిండ్సే గుర్తు చేశారు. ఇదే విషయంపై బ్రిటన్ ప్రధాని బోరిక్ జాన్సన్ కూడా స్పందించారు. నూతనంగా ఎంపికైన సభ్యుల్లో తల్లిదండ్రుల పాత్రలో ఉన్నవారు కూడా సభకు ఎన్నికయ్యారని, వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత కూడా తమపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే గతంలో ఓ ఎంపీ ఇలా ఓ చంటిబిడ్డతో హాజరయ్యారు. జోన్స్విన్సన్ అనే ఎంపీ 2018 లో తన చంటిబిడ్డతో హాజరయ్యారని, దీనిని అధికారులు ఎలా మరిచిపోయారని కొందరు ఎంపీలు పార్లమెంట్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.