UK | బ్రిటన్లో పలువురిని మోసం చేసినందుకు భారత సంతతి వ్యక్తి కటకటలాపాలయ్యాడు. జస్పాల్ సింగ్ జుట్లా (64) అనే వ్యక్తికి లండన్లోని ఐల్వర్త్ క్రౌన్ కోర్టు మూడేళ్ల శిక్ష విధించిందని స్కాట్లాండ్ యార్డ్ తెలిపింది. ఆస్తుల కొనుగోలులో సహకారం అందిస్తానంటూ పలువురిని 16వేల పౌండ్స్ మోసానికి పాల్పడ్డాడు. అతని బాధితుల్లో ఎక్కువ మంది భారతీయ సంతతికి చెందిన వారు కావడం గమనార్హం. ఈ మేరకు మెట్రోపాలిటన్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.
2019-21 మధ్య జస్పాల్ సింగ్ మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు గతేడాది ఆగస్ట్లో ఉక్స్బ్రిడ్స్ మేజిస్ట్రేట్ కోర్టులో గత విచారణ సందర్భంగా నేరాన్ని అంగీకరించాడు. లండన్లోని ఐల్వర్త్ క్రౌన్ కోర్టు తాజాగా జస్పాల్కు శిక్ష విధించింది. గృహ రుణ సలహాదారుగా నటిస్తూ నలుగురిని 15,970 పౌండ్లు మోసానికి పాల్పడ్డట్లు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేటర్ డిటెక్టివ్ కానిస్టేబుల్ అనితా శర్మ తెలిపారు. విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడి పలువురిని తన ఉచ్చులోకి లాగి.. మోసానికి పాల్పడ్డట్లు పేర్కొన్నారు.